తెలంగాణ ఎమ్మెల్యేలు, సెటిలర్ ఎమ్మెల్యేలు.. అంటూ జరుగుతున్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టించింది. “బయటి నుంచి బతకడానికొచ్చిన నువ్వేంటి మాట్లాడేది” అంటూ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ గురించి ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆ వ్యాఖ్యల వెనక వాళ్ల బాస్ కేసీఆర్ ఉన్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కౌశిక్ వ్యాఖ్యలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఓటర్లను అవమానిస్తారా..?
బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్టు అలా బతకడానికి తెలంగాణ వచ్చిన వారు ఓట్లు వేస్తేనే కదా హైదరాబాద్ నగరంలో ఆ పార్టీకి సీట్లు వచ్చాయని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఓట్లు వేసి గెలిపించిన వారిని అవమానించేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. కౌశిక్ రెడ్డి సొంతంగా మాట్లాడారా, లేక కేసీఆర్ కుటుంబం అలా మాట్లాడించిందా అనేది తేలాలన్నారు. కేసీఆర్ కుటుంబం అలా మాట్లాడించి ఉంటే వారంతా ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు అని చెబితే మాత్రం… ఆయన్ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అరెకపూడి గాంధీకి బీఆర్ఎస్ సభ్యుడి హోదాలోనే పీఏసీ అధ్యక్ష పదవి దక్కిందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ పదవికి పార్టీ ప్రతిపాదన అవసరం లేదన్నారాయన. అధ్యక్ష ఎన్నిక కోసం నోటిఫికేషన్ ఇస్తే ఆసక్తి ఉన్నవారు నామినేషన్లు వేశారని, రహస్య ఓటింగ్ విధానంలో అరెకపూడి గాంధీ గెలిచారని చెప్పుకొచ్చారు. పీఏసీ పదవి అరికెపూడి గాంధీకి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న వారు గతం మరచిపోయారా అని అడిగారు రేవంత్. 2018 నుంచి 2023 వరకు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా కూడా పీఏసీ ఛైర్మన్ పదవి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి ఇచ్చారని, అప్పుడెందుకు ఈ లాజిక్ లు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ పాటించిన విధానాన్నే తాము అమలు చేస్తున్నామని, ఇప్పుడెందుకు గొడవ చేస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి.