బిహార్ కోర్టు పోలీసులకు ఇచ్చిన ఆదేశాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. 34 ఏళ్ల కిందట రూ.20 లంచం తీసుకున్న కేసులో నిందితుడిపై తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఆసక్తికరమైన ఈ అరుదైన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 1990లో బిహార్లోని సహర్సా రైల్వేస్టేషన్లో సురేశ్ ప్రసాద్ అనే కానిస్టేబుల్ విధులు నిర్వర్తించేవాడు. ఆ ఏడాది మే 6న సీతాదేవి అనే మహిళ కూరగాయల మూటను ప్లాట్ఫాంపై తీసుకెళుతుండటాన్ని గమనించిన కానిస్టేబుల్ ఆమెను ఆపి.. రూ.20 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
సీతాదేవి కానిస్టేబుల్ సురేశ్ ప్రసాద్కి డబ్బులు ఇస్తున్న సమయంలో అప్పటి రైల్వేస్టేషన్ ఇన్చార్జి కానిస్టేబుల్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అతన్ని పోలీసులకు అప్పగించడంతో అరెస్ట్ చేశారు. 1999లో ఆ కానిస్టేబుల్ బెయిల్ తీసుకొని పరారయ్యాడు. దీనిని గుర్తించిన న్యాయస్థానం అతని బెయిల్ రద్దు చేసి, అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. నిందితుడు తప్పుడు చిరునామా, వివరాలు ఇవ్వడంతో అతని ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు.
పోలీసు శాఖలో అవినీతి, దుష్ప్రవర్తనకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులను పరిష్కరిస్తున్న సమయంలో తాజాగా ఈ కేసుపై కోర్టు దృష్టిసారించింది. పరారీలో ఉన్న మాజీ కానిస్టేబుల్ను అరెస్ట్ చేసి, కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది. డీజీపీకి స్పెషల్ విజిలెన్స్ న్యాయమూర్తి సుదేష్ శ్రీవాస్తవ గురువారం ఈ ఆదేశాలిచ్చారు. ఇప్పటికైనా అతని ఆచూకీ దొరుకుతుందా లేదా అనేది చూడాలి మరి.