పింఛన్ల విషయంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే కోత పెట్టారు. పింఛన్ల మంజూరులో లంచగొండితనం, వివక్ష, జన్మభూమి కమిటీల పెత్తనం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నాయి. వాటికి తావు లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేస్తోంది. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 29.51 లక్షల మంది జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా పింఛన్లు అందుకుంటున్నారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు పింఛన్ల సంఖ్య పిసరంత కూడా పెరగలేదు. అప్పుడు 43.11 లక్షల మంది లబ్ధిదారులున్నారు. అయినప్పటికీ 30 లక్షల మందికే పింఛన్ల చెల్లింపులు జరుగుతూ వచ్చాయి.
కుటుంబానికి ఒక్కటే పింఛను విధానాన్ని చంద్రబాబు నాయుడు అమలులోకి తెచ్చారు. ఈ మేరకు 2014 సెప్టెంబర్ 18వ తేదీన జిల్లా కలెక్టర్లకు చంద్రబాబు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే కుటుంబంలో ఇద్దరు దివ్యాంగులుంటే రెండో పింఛను ఇచ్చే విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీర్ఘకాలిక వ్యాధులతో సతమవుతున్నవారికి రూ.10 వేల చొప్పున ప్రతి నెలా పింఛను అందుతోంది. ఈ విధానాన్ని జగన్ ప్రభుత్వమే ప్రవేశపెట్టింది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2015 మేలో 0.8 శాతం అంటే 36,406 మరణాలు సంభవిస్తే ఆ నెలలోనే వారికి కోత పెట్టింది. అదే ఏడాది ఏప్రిల్ లో 22,334 మంది పింఛనుదారులు మరణించినట్లు లెక్కలు వేసి వారిని తొలగించింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవ మరణాలనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. గత ఆరు నెలల కాలంలో ఏ నెలలో కూడా పింఛనుదారుల మరణాలు 20 వేలకు మించలేదు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పింఛను కోసం వృద్ధులు, దివ్యాంగులు గంటల తరబడి క్యూలలో వేచి ఉండాల్సిన పరిస్థితి. జగన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2.6 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే లబ్ధిదారుల ఇళ్ల వద్దనే అందిస్తోంది.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, జన్మభూమి కమిటీల పెత్తనం లబ్ధిదారులకు చుక్కలు చూపించేవి. వాటికి తావు లేకుండా పారదర్శకంగా జగన్ ప్రభుత్వ పింఛన్లను మంజూరు చేస్తోంది. అర్హత ఉండి ఏదైనా కారణం వల్ల లబ్ధి పొందనివారికి మరో అవకాశం కల్పిస్తూ ప్రతి ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో అందిస్తున్నారు.
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో దివ్యాంగులు పొందిన ప్రయోజనం కేవలం రూ.58,500. జగన్ ప్రభుత్వం అందించిన ప్రయోజనం రూ.1,91,000. అంటే లక్షా 32 వేల 500 అదనం. పెనన్షపై నెలవారీ సగటు వ్యయం కూడా రూ.400 కోట్ల నుంచి రూ.1968 కోట్లకు పెరిగింది.