టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో హెచ్సిఎల్ తప్ప పేరున్న ఒక్క ఐటీ సంస్థ కూడా రాలేదు. హెచ్సీఎల్ కూడా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ప్రారంభమైంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభమైంది. విప్రో కూడా డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభిస్తోంది. అమెజాన్, బీఈఎల్, రాండ్ శాండ్, టెక్నోటాస్క్, ఐజెన్ సాఫ్ట్వేర్, టెక్బుల్, కాంప్లెక్స్ వంటి పలు సంస్థలు రాష్ట్రానికి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంకుర సంస్థలు మూడు రెట్లు పెరిగాయని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి రాజ్యసభలో చెప్పిన విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. 2019 నాటికి రాష్ట్రంలో 161 సార్టప్లు ఉండగా ఇప్పుడు 586కు చేరుకున్నాయి. వాటిలో ఉద్యోగుల సంఖ్య 1,556 నుంచి 55,66కు పెరిగింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో ఎక్కడా లేని రీతిలో నాలుగో పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని కల్పతరువు పేర విశాఖలో ఏర్పాటు చేశారు. అక్కడు పెద్ద ఎత్తున సార్టప్లు వస్తున్నాయి.
నాస్కామ్ సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ‘ఏ హబ్’ ఏర్పాటు చేశారు. మెడ్టెక్ జోన్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు ఏశారు.
ఐటీ రంగంలో 65 కంపెనీలు..
వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా 65 కంపెనీలు ఐటీ రంగంలో ఏర్పడ్డాయి. వీటి ద్వారా కొత్తగా 47,908 ఉద్యోగాలు వచ్చాయి. చంద్రబాబు 2019లో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేనాటికి ఐటీ ఉద్యోగుల సంఖ్య 27,643 కాగా, ఇప్పుడు 75,551 మందికి పెరిగింది.
విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించిన టెక్ మహీంద్ర విజయవాడకు విస్తరించింది. హెచ్సీఎల్ విజయవాడ నుంచి తిరుపతికి విస్తరించింది. విశాఖలో ఉన్న డబ్ల్యూఎస్ఎస్, పల్సస్ వంటి 30కి పైగా ఐటీ కంపెనీలు విస్తరణ చేపట్టాయి. 2012లో 50 మందితో ప్రారంభమైన డబ్ల్యూఎస్ఎస్ గ్లోబల్ సర్వీసెస్ ఉద్యోగల సంఖ్య 3,300 దాటింది. వీరిలో 2 వేల మంది ఉద్యోగులు గత రెండేళ్లలో చేరినట్లు ఆ సంస్థ సీఈవో ఆర్. మురుగేష్ చెప్పారు. 2019లో 40 మందితో ప్రారంభమైన తమ సంస్థలో ఉద్యోగుల సంఖ్య 4,200 దాటినట్లు పల్సస్ సీఈవో గేదెల శ్రీనుబాబు చెప్పారు. రాష్ట్రంలో ఐటీ రంగం ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు కాన్సెప్ట్ సిటీలను ఏర్పాటు చేస్తోంది.
ప్రైవేట్ రంగంలో ఐటీ పార్కులను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రూ.21,844 కోట్లతో ఆదానీ డేటా సెంటర్, భారీ ఐటీ టవర్ ఏర్పాటవుతున్నాయి. రహేజా గ్రూప్ ఇనార్బిట్ మాల్నే కాకుండా ఐటీ టవర్ను కూడా నిర్మిస్తోంది. ఏపీఏఐసీసీ రూ.2,300 కోట్లతో మధురవాడలో 19 ఎకరాల్లో ఐ స్పేస్ పేరుతో ఐటీ టవర్ను నిర్మిస్తోంది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఐటీ రంగానికి సంబంధించి 65 ఎంవోయులు కుదిరాయి. ఈ ఒప్పందాల ద్వారా రూ.28,867 కోట్ల పెట్టుబడులు వస్తాయి, లక్షా 14 వేల 255 మందికి ఉద్యోగాలు వస్తాయి.
నిక్సీ వస్తే..
విశాఖపట్నం కేంద్రంగా నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (నిక్సీ) ద్వారా ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిక్సీ బృందం విశాఖను సందర్శించింది కూడా. ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటైతే ఇతర రాష్ట్రాల నుంచి డేటాను కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. దానివల్ల పలు కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు సాగించడానికి వెసులుబాటు కలుగుతుంది.
దాని రద్దుకు కారణం..
డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్స్ రద్దు చేయడానికి కారణం ఉంది. ఈ పథకం ఓ పెద్ద కుంభకోణం. ఎటువంటి కంపెనీలు రాకపోయినా రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధంగా పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద నిర్మించిన భవనాల్లో కంపెనీలు రాకపోతే 70 శాతం అద్దెను, అది కూడా బిల్డర్ ఎంత నిర్ణయిస్తే అంత రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. అందుకే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది.