పొత్తులో భాగంగా జనసేనకు 24 స్థానాలు కేటాయిస్తున్నట్లు టీడీపీ ప్రకటించిందో లేదో ఇటు పవన్పై విమర్శల వాన మొదలైంది. ఒకవైపు మంత్రి అంబటి రాంబాబు, దర్శకుడు రాంగోపాల్ వర్మ వంటి వారు వరుసపెట్టి జనసేనపై విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పల్లకి మోయడానికి మాత్రమే పనికొస్తాడని ఓ ట్వీట్ వేసిన మంత్రి అంబటి రాంబాబు మరోసారి ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు.
పల్లకి మోసి పరువు తీసుకోకుండా జనసేనను విలీనం చేసి మీ అన్న చిరంజీవి లాగా సినిమాలు తీసుకో.. అంటూ ఘాటు విమర్శలు చేశారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం 18 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి పొందారు. పదవీకాలం ముగిసిన తర్వాత రాజకీయాలను వదిలేసి పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారు.
పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి పదేళ్లయింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఒక్క స్థానంలో జనసేన గెలుపొందింది. కనీసం ఈ సారైనా జనసేన ఎన్నికల్లో సత్తా చాటుతుందని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్న తరుణంలో ఈ ఎన్నికల్లో పార్టీ కేవలం 24 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నట్లు తెలిసి తీవ్ర సంతృప్తికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి అంబటి రాంబాబు టీడీపీ పల్లకి మోసి పరువు తీసుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకో చిరంజీవి లాగా అంటూ.. పవన్కు ఓ సూచన చేశారు.
పావలాకి పావలా సీట్లు అంటారనే..
పవన్ కళ్యాణ్ 24 సీట్లతో సరిపెట్టుకోవడంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. పవన్కు 23 సీట్లు ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారని.. 25 సీట్లు ఇస్తే పావలాకు పావలా సీట్లు ఇచ్చారని ట్రోల్ చేస్తారని.. మధ్యే మార్గంగా 24 సీట్లు ఇచ్చారని వర్మ వెటకారం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జనసేన ఒకే ఒక్క స్థానంలో గెలుపొందగా.. టీడీపీ కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకుంది.