తెలుగుదేశం పార్టీ గుంటూరు లోక్సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన అమెరికాలో డాక్టరు. అతి పెద్ద వ్యాపారస్తుడు. నామినేషన్లో తన ఆస్తి రూ.అయిదు వేల కోట్లకు పైనే అని బయటపెట్టారు. ఇలా వెల్లడించడం అంటే అదంతా వైట్ మనీ అని! బ్లాక్ మనీ ఇంకెన్ని వేల కోట్లు పేరుకుపోయి ఉందో..? గతంలో గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీగా ఉన్నారు. ఆయన ఆస్తి వేల కోట్లలోనే..! అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి, చంద్రబాబు చెంచా సీఎం రమేష్ ఆస్తులు రూ.395 కోట్లు మాత్రమే. ఈ బంగారు తండ్రి మీద ఏడు కేసులు కూడా ఉన్నాయి. బాబు సన్నిహిత బంధువు పురందేశ్వరికి కోటాను కోట్ల ఆస్తులున్నాయి. చంద్రబాబు ఆస్తి ఎంతో తెలిస్తే కళ్లు తిరిగి కింద పడతారు. భువనేశ్వరీ, లోకేష్లకు ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు మూలుగుతోంది. లోకేష్ భార్య బ్రాహ్మణి హెరిటేజ్ అనే మెగా వ్యాపార సంస్థకి సూపర్ బాస్. వేల కోట్ల టర్నోవర్తో ఆమె చక్రం తిప్పుతున్నారు. ఇదంతా ఎవరికో కోట్లు ఉన్నాయని ఏడవడం కాదు. వాళ్లంతా పేదల్ని, బడుగు వర్గాల్ని ఉద్దరిస్తాం అనడంతోనే పేచీ వస్తోంది.
ప్రజలతో సంబంధం లేని, సామాన్య జనం సమస్యలు అంటే ఖాతరులేని, లెక్కలేని కోట్ల కొవ్వు బలిసిన వాళ్లు చంద్రబాబుకి ప్రియ మిత్రులు, అతి సన్నిహితులు. వ్యాపారాలు విస్తరించుకుని, మరిన్ని వేల కోట్లు కూడబెట్టుకుని, కుల సామ్రాజ్యాలను నిర్మించుకోవడమే వీళ్లందరి లక్ష్యం. ఇలాంటి వాళ్లని కూడగట్టడంలో, ముగ్గులోకి దించడంలో చంద్రబాబు దిట్ట. అర్జెంటుగా జగన్మోహన్రెడ్డిని ఓడించడానికి తన సత్తా సరిపోదని చంద్రబాబు కరెక్ట్గానే గుర్తించారు.
కాపు ఓటు కీలకం కనుక ముందుగా హీరో పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నారు. బేరం కుదుర్చుకున్నారు. పవన్ని ముందుకి నెట్టి ప్రధాని మోడీనీ, అమిత్ షానీ దారిలోకి తెచ్చుకున్నారు. ప్రతిఫలంగా బలహీనమైన బీజేపీకి బోల్డన్ని అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు సమర్పించుకున్నారు. ఎన్ని వేషాలు వేసినా, రాజకీయంగా జగన్ని ఓడించడం అసాధ్యం అని బోధపడ్డాక డబ్బు సంచులు విప్పడమే మార్గం అని చంద్రబాబుకి తెలిసొచ్చింది. ఎన్నారైలని బతిమిలాడుకున్నాడు. ‘‘డబ్బు వెదజల్లండి, అధికారంలోకి వచ్చాక నేను చూసుకుంటాను’’అని ప్రలోభపెడుతున్నాడు. మనమంతా ఆంధ్రప్రదేశ్ని రక్షించాలని అబద్ధాలని ప్రచారంలో పెడుతున్నాడు. బీజేపీలో బాబు మనుషులే! జనసేనలో బాబు మనుషులే. ఆ లిస్టు మీకు కావాలంటే నాదెండ్ల మనోహర్ని సంప్రదించండి!
చంద్రబాబు వేషాలూ, మోసాల వెనకే జగన్ విజయం దాగివుంది. రాష్ట్రమంతటా బస్సు యాత్రలో జగన్ వెంట ఉన్నదెవరు? నామినేషన్ వేస్తున్న వైసీపీ అభ్యర్థుల వెంట నడుస్తున్నదెవరు..? గమనించారా..? వాళ్లంతా బలహీనవర్గాలవాళ్లు.. రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్యులు, దళితులు, ముస్లింలు, బీసీలు, క్రిస్టియన్లు, పనులు చేసుకునే ఆడవాళ్లు, ఆటో డ్రైవర్లు, ఫ్యాక్టరీ కార్మికులు, తమ బిడ్డల భవిష్యత్ మీద గంపెడు ఆశలు ఉన్నవాళ్లు, నూరు శాతం నమ్మకం జగన్ మీద ఉంచినవాళ్లు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చంద్రబాబు కోటీశ్వరుల పార్టీగా, కార్మికులు, కూలీల జగన్ పార్టీగా విడిపోయి ఉంది. నెత్తురు పీల్చే వ్యాపారస్తులు మట్టికరిచి, పేద జనం గెలుపు కెరటాలపై జగన్తో కలిసి నడిచే రోజు ఇంకెంత దూరంలోనో లేదు.