భారీ వర్షాల వల్ల పాఠశాలకు సెలవు ప్రకటించడంతో ఉపాధ్యాయుడు, విద్యార్థులు ఆనందంగా ఇంటికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు మార్గమధ్యలోని వాగులో కొట్టుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలో ఈ ఘటన జరిగింది. కొద్దిసేపట్లో ఇంటికి వెళ్లాల్సినవారు తిరిగిరాని లోకాలకు చేరిపోయారు.
నంబూరులోని ఓ పాఠశాలలో ఉప్పలపాడుకు చెందిన రాఘవేంద్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా శనివారం ఉదయం పాఠశాల యాజమాన్యం సెలవు ప్రకటించడంతో తన గ్రామానికే చెందిన ఇద్దరు విద్యార్థులు మానిక్, సాత్విక్లను తీసుకొని కారులో స్వగ్రామానికి బయలుదేరారు. ఉప్పలపాడు సమీపంలోకి వచ్చేసరికి మురుగు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నా ఆగకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వరద ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో రాఘవేంద్రతో పాటు కారులో ఉన్న విద్యార్థులు, సాత్విక్, మానిక్ ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో కారుతో పాటు వాగులో కొట్టుకుపోయిన మృతదేహాలను బయటకు తీశారు.