హైడ్రాకు చట్టబద్ధతతో సర్వాధికారాలు కల్పించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలతో పాటు వాటి ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పరిరక్షణ అధికారాలన్నీ హైడ్రాకే అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ కేబినెట్. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి డిప్యుటేషన్పై 169 మంది అధికారులను, 940 ఔట్ సోర్సింగ్ సిబ్బందితో హైడ్రాకి మరింత సిబ్బందిని సమకూర్చింది. ఇతర శాఖల మాదిరిగా హైడ్రాకు అధికారాల్లో పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 అర్బన్ స్థానిక సంస్థలతో పాటు.. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్లో చేర్చిన 51 పంచాయతీలనూ కూడా హైడ్రా పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది.
కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడుతూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టాలని నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఫైర్ స్టేషన్కు 34 మంది సిబ్బంది నియామకానికి కేబినెట్ అనుమతించింది. కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీలలో 3 వేల పైచిలుకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు అనుమతిచ్చింది. వాటి భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీచేస్తామని తెలిపింది.
రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం ఎలైన్మెంట్ ఖరారుకు 12 మంది ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటుచేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. దీనికి పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్గా ఉంటారని మంత్రులు పేర్కొన్నారు. పోలీసు ఆరోగ్య భద్రత పథకాన్ని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కు కూడా వర్తింపజేసేలే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఖరీఫ్లో పండే సన్న ధాన్యం కొనుగోలుకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తిచేయడానికి సవరించిన అంచనా వ్యయం ప్రకారం రూ.4,637 కోట్ల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎస్ఎల్బీసీ పనులు పూర్తిచేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం నల్గొండ జిల్లా ప్రజలకు ఎంతో సంతోషకరమైన వార్త అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. దీంతో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు.