ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన విడుదల చేసిన అభ్యర్థుల మొదటి జాబితా తెలుగుదేశం పార్టీలో అగ్గి రాజేసింది. ఒప్పందం మేరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మొత్తం 118 సీట్లకు పొత్తులకు గాను 99 సీట్లకు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అభ్యర్థుల ప్రకటనతో చంద్రబాబుకు పోటు మొదలైంది. లిస్ట్లో తమ పేర్లు లేకపోవడంతో పోటీకి రెడీగా ఉన్న టీడీపీ నేతలు, వారి అనుచరులు నిరసనలు మొదలుపెట్టారు. మరికొందరు నాయకులు రాజీనామాల బాట పట్టారు. దీంతో టీడీపీ క్యాంప్లో అలజడులు మొదలయ్యాయి. ఫస్ట్ లిస్టుకే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోయే జాబితాలకు పరిస్థితేంటో అని టీడీపీ పెద్ద తలకాయలు తలలు పట్టుకుంటున్నాయి.
పి. గన్నవరం టికెట్ మహాసేన రాజేశ్కు కేటాయించడంతో గన్నవరం టీడీపీ మండల అధ్యక్షుడు సత్తిబాబు పార్టీకి రాజీనామా చేశారు. అటు అనకాపల్లి టికెట్ జనసేన నేత కొణతాల రామకృష్ణకు కేటాయించడంతో టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. టీడీపీ కరపత్రాలను నేతలు దహనం చేశారు. మోసానికి మారు పేరు చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గానికి బండారు శ్రావణి పేరును ప్రకటించడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. అనంతపురం టీడీపీ కార్యాలయం కిటికి అద్దాలు ధ్వంసం చేసి నిరసన తెలిపారు.
టీడీపీ- జనసేన ఫస్ట్ లిస్ట్పై మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిస్టులో తన పేరు లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అవనిగడ్డ నుంచి టీడీపీ తరఫున ఆయన టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా కూడా ఆయనే ఉన్నారు. మరోవైపు అవనిగడ్డ టికెట్ జనసేనకు ఇస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఉమ్మడి అభ్యర్థిగా తనకే సీటు వస్తుందని బుద్ధ ప్రసాద్ ఆశపడ్డారు. కానీ పొత్తుల సీట్ల ప్రకటనలో భాగంగా అవనిగడ్డ సీటును చంద్రబాబు, పవన్ పెండింగ్లో పెట్టారు. ఈ నేపథ్యంలో మండలి బుద్ధ ప్రసాద్ చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు చేశారు. “రాజకీయాలు మారిపోయాయి. డబ్బే రాజకీయాలకు ప్రధానమైపోయింది. ధనవంతుల కోసమే పార్టీలు అభ్యర్థులుగా అన్వేషిస్తున్నాయి”. అంటూ విమర్శలు గుప్పించారు మండలి బుద్ధ ప్రసాద్.