వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన నేతల పరిస్థితి ఇబ్బందిగా తయారైంది. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి టీడీపీలో చేరిన వీళ్ళు ఏమి సాధించారు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మంత్రి గుమ్మనూరు జయరామ్ మంగళవారం టీడీపీలో జాయిన్ అయ్యారు. మూడు రోజుల క్రితం కొలుసు పార్థసారథి చేరారు. వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి దాదాపు టీడీపీలో జాయిన్ అయిపోయినట్లే. విచిత్రం ఏమిటంటే వైసీపీలో ఉన్నప్పుడు తాము కోరుకున్న సీట్లలో జగన్ వీళ్ళకి టికెట్లు ఇవ్వలేదు. అందుకనే జగన్ మీద వ్యతిరేకత పెంచుకుని చంద్రబాబుతో మాట్లాడుకుని టీడీపీలో చేరారు.
పెనమలూరులో కొలుసు పార్థసారథి పోటీ చేయాలని అనుకున్నారు. టికెట్ ఇవ్వటానికి జగన్ నిరాకరించారు. దాంతో కొలుసు అంగీకరించకుండా జగన్ మీద కోపంతో టీడీపీలో చేరిపోయారు. పెనమలూరులో టికెట్ హామీఇచ్చిన చంద్రబాబు చివరకు నూజివీడులో టికెట్ ఖాయం చేశారు. చంద్రబాబును గట్టిగా అడిగితే ఇదికూడా పోతుందన్న భయంతో కొలుసు నోరెత్తకుండా చివరకు నూజివీడుకు వెళ్ళారు. మంత్రి గుమ్మనూరు జయరామ్ది కూడా దాదాపు ఇదే కథ. జయరామ్ను జగన్ కర్నూలు ఎంపీగా పోటీ చేయమన్నారు. దానికి ఒప్పుకోని మంత్రి బాగా ఓవరాక్షన్ చేశారు. దాంతో పార్లమెంటు నియోజకవర్గానికి సమన్వయకర్తగా బీవై రామయ్యను నియమించారు.
ఆలూరులో టికెట్ కోసం మంత్రి జగన్ను బెదిరించాలని చూసినా సాధ్యంకాలేదు. దాంతో చంద్రబాబుతో మాట్లాడుకుని టీడీపీలో చేరిపోయారు. అయితే విచిత్రం ఏమిటంటే జయరామ్కు కర్నూలు జిల్లా ఆలూరులో కాకుండా అనంతపురం జిల్లాలోని గుంతకల్లు టికెట్ ఇచ్చారు. చేసేదిలేక వచ్చే ఎన్నికల్లో జయరామ్ గుంతకల్లులో పోటీకి రెడీ అవుతున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిది ఇంకో కథ. ఇదేమిటంటే గురజాలలో టికెట్ కావాలని అడిగితే జగన్ అంగీకరించలేదు. దాంతో జగన్పై నోటికొచ్చినట్లు మాట్లాడి పార్టీకి దూరమైపోయారు.
చంద్రబాబు మీద నమ్మకంతో ముఖ్యమంత్రి మీద జంగా ఇష్టమొచ్చినట్లు నోరుపారేసుకున్నారు. ఇప్పుడు విషయం ఏమిటంటే జంగాకు గురజాలలో టికెట్ లేదు. ఇంకెక్కడైనా ఇస్తానని చెప్పిన చంద్రబాబు అసలు టికెట్ ఇస్తారో లేదో కూడా అనుమానమే. వ్రతం చెడ్డా ఫలితం దక్కాలనేది సామెత. ఇక్కడ ఈ ముగ్గురికి వ్రతమూ చెడింది..ఫలితమూ దక్కలేదు. మరిక వీళ్ళు జగన్పైన ఎందుకు నోరుపారేసుకున్నట్లు? టీడీపీలో చేరి ఏం సాధించారో అర్థంకావటంలేదు.