ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దిగజారుస్తున్న రాజకీయ నాయకుల్లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ఒక్కరు. ఆయన దూకుడుగా వ్యాఖ్యలు చేసి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను చిక్కుల్లో పడేశానని భావిస్తూ ఉంటారు. ఆ వ్యాఖ్యలను పరిశీలిస్తే కనీసం ఆయనకు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవని అర్థమవుతుంది. రాజకీయంగా పరిపక్వత సాధించడానికి ప్రయత్నించడానికి బదులు అడ్డగోలు వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు.
గీతాంజలి ఉదంతంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఆమె మరణానికి కనీసం విచారం కూడా వ్యక్తం చేయకుండా వైసీపీని నిందించే పనికి పూనుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన క్రూరమైన మనస్తత్వాన్ని అది పట్టిస్తోంది.
తండ్రి శవంతో జగన్ పార్టీని ప్రారంభించారని, బాబాయి బలితో 2019 ఎన్నికల్లో గెలిచారని ఆయన అన్నారు. జగన్ను ఒంటరి చేసి అణచేయడానికి జరిగిన ప్రయత్నాల్లో ఆయన లేచి నించున్నాడు. నిజానికి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఆయన తండ్రి చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అప్పుడెందుకు నిందితులను గుర్తించలేకపోయారు. అప్పుడు చేతులు ముడుచుకుని కూర్చుని అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్ను నిందిస్తున్నారు.
గీతాంజలి అనే మహిళతో బలవంతంగా అబద్ధాలు చెప్పించారని నారా లోకేష్ అంటున్నారు. ఇదెంత అబద్ధమో ఆయన మనసుకు తెలుసు. కానీ రాజకీయం కోసం ఆయన అలా మాట్లాడుతున్నారు. బాధితురాలు 7వ తేదీన ప్రమాదానికి గురయ్యారో, ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియదని ఏమీ ఎరగనట్లు మాట్లాడుతున్నారు. ఉదంతాన్ని మరింత సంక్లిష్టం చేసి తప్పించుకోవాలని ఆయన చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఇప్పుడు గీతాంజలి ఉదంతాన్ని వాడుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన అంటున్నారు. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆయన మరో తప్పు చేస్తున్నట్లు అనిపిస్తోంది.