ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తగిన ఫలితాలు సాధిస్తుందనే నమ్మకం ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్నట్లు లేదు. చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం సభపై కూడా ఆయన అంత సంతృప్తిగా లేనట్లు అనిపిస్తోంది. సోమవారం ఎక్స్లో చేసిన పోస్టు ఆ విషయాన్ని తెలియజేస్తోందని నెటిజన్లు అంటున్నారు.
తాను ఈ రోజు జగిత్యాల, శివమొగ్గల్లో జరిగే ర్యాలీల్లో పాల్గొంటానని, ఆ తర్వాత సాయంత్రం కోయంబత్తూరులో రోడ్ షో చేస్తానని, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఎన్డీఏకు అనుకూల వాతావరణం ఉందని ఆయన ఎక్స్లో పోస్టు పెట్టారు.
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను తన పోస్టులో ప్రస్తావించిన మోడీ ఆంధ్రప్రదేశ్ మాట ఎత్తలేదు. పోస్టు పెట్టడానికి ఒక్క రోజు ముందే ఆయన చిలకలూరిపేట సభలో పాల్గొన్నారు. అయినప్పటికీ దాన్ని దాటేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ తగిన ఫలితాలు సాధిస్తుందనే నమ్మకం మోదీకి లేదని, అందుకే ఆంధ్రప్రదేశ్ను తన పోస్టులో ప్రస్తావించలేదని నెటిజన్లు అంటున్నారు.