తమకు గిట్టని, తమకు సహకరించని పోలీసు ఉన్నతాధికారులను టీడీపీ టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే కొంత మంది అధికారులను టార్గెట్ చేసి ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేసింది. వారిపై దుష్ప్రచారానికి కూడా తెగబడుతోంది. చిలకలూరిపేటలో ప్రజాగళం సభ వైఫల్యాన్ని పోలీసు అధికారులకు అంటగట్టేందుకు టీడీపీ సిద్ధపడింది. సభ ఏర్పాట్లను పూర్తిగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పర్యవేక్షించారు. అయితే, ఆ సభలో గందరగోళం చెలరేగడానికి ప్రధాన కారణం పోలీసు అధికారులేనని ఆరోపిస్తూ టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.
సభ నిర్వహణ లోపాలను కప్పిపుచ్చుకుంటూ పోలీసు ఉన్నతాధికారులను టీడీపీ టార్గెట్ చేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, గుంటూరు ఐజీ బాలరాజులపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనను అలా పక్కన పెడితే.. వివిధ కారణాలు చూపిస్తూ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిలపై కూడా ఈసీకి ఫిర్యాదు చేసింది.
నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిలను కూడా టీడీపీ టార్గెట్ చేసింది. తమకు ఎన్నికల్లో సహకరించబోరని అనుకుంటున్నవారిని, ఒక సామాజికవర్గానికి చెందినవారిని టీడీపీ లక్ష్యంగా ఎంచుకుని వారిపై చర్యలు తీసుకునే విధంగా వ్యూహరచన చేసింది. వారికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తూ ఈసీపై ఒత్తిడి పెంచేలా చూడాలనేది టీడీపీ ప్లాన్గా కనిపిస్తోంది.
కొంత మంది తటస్థులను ఎంపిక చేసుకుని వారిపై ఈసీకి ఫిర్యాదు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. వారిపై చర్యలు తీసుకునే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఒత్తిడి పెంచాలనే ఎత్తుగడలో టీడీపీ ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న వ్యవహారాన్ని ఇందుకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తోంది.