రైతుల ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకుంది. గతంలో వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు మీటర్ల ద్వారా విద్యుత్ వినియోగం జరిగేది. ఆ తర్వాత మోటార్ హార్స్ పవర్ ప్రాతిపదికపై వినియోగాన్ని లెక్కించడంతో మీటర్ల వాడకం తగ్గించారు. ఆ తర్వాత విద్యుత్ సంస్థలు విడతలవారీగా వినియోగదారులకు కెపాసిటర్లను అందించాయి. అయితే రైతులు కాలక్రమేనా వాటిని తీసేశారు. దాంతో సరఫరాలో హెచ్చుతగ్గులు ఏర్పడి ట్రాన్స్ఫార్మర్లు, విదుత్తు మోటార్లు కాలిపోతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారుల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఆ ఉత్తర్వుల మేరకు… నాణ్యమైన కరెంట్ను సరఫరా చేయడానికి వీలు కలుగుతుంది. విద్యుత్ పంపిణీలో నష్టం తగ్గుతుంది. విద్యుత్ నష్టాన్ని తగ్గించడం కోసం, పారదర్శకత కోసం స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. రైతుల ఖాతాల్లో నెలసరి వినియోగ చార్జీలను ప్రభుత్వం జమ చేస్తోంది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ బాక్సులను ఏర్పాటు చేయడంతో పాటు పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలను కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
దానివల్ల ఎంసీబీ ద్వారా ఓవర్ లోడ్ రక్షణ జరుగుతుంది. దానివల్ల విద్యుత్ ప్రమాదాలు తగ్గుతాయి. ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యం కూడా తగ్గుతుంది. కెపాసిటర్ల వల్ల ఉత్తమ ప్రమాణాలతో రైతులకు విద్యుత్ను సరఫరా చేయడానికి వీలు కలుగుతుంది.
మీటర్ల ఏర్పాటు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సబ్సిడీ మొత్తం మిగులుతుంది. ఈ మిగులు డబ్బును రాష్ట్రంలోని సంక్షేమ పథకాల అమలుకు ఖర్చు చేయడానికి వెసులుబాటు కలుగుతుంది. డిస్కంలకు జవాబుదారీతనం పెరుగుతుంది. స్మార్ట్ మీటర్ల వల్ల లోడ్ సామర్థ్యాన్ని అంచనా వేసుకుని భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోడం సులభమవుతుంది. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ఓల్టేజీ హెచ్చుతగ్గుల విషయంలో రైతాంగానికి, సంస్థకు మధ్య పారదర్శకతను పెంచడానికి అవకాశం చిక్కుతుంది.