అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్న నేపథ్యంలో అన్ని పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. అయితే వైసీపీ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను విడుదల చేసి ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేయగా మరోవైపు తెలుగుదేశం పార్టీతో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలను ప్రకటించింది.
బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎచ్చెర్ల, అనపర్తి, ధర్మవరం, విజయవాడ వెస్ట్ స్థానాల్లో టికెట్లు ఆశించిన టీడీపీ, జనసేన ఆశావహుల ఆశలపై బీజేపీ నీళ్లు చల్లింది. దీంతో ఆ ప్రాంత టీడీపీ నేతలు అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అభ్యర్థిగా మొదటి జాబితాలోనే ప్రకటించింది. తన పేరును ప్రకటించడంతో ఈయన ప్రచార కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు కానీ కూటమిలో భాగంగా ఇక్కడ బీజేపీ నేత ఎం. శివకృష్ణంరాజును అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో అనపర్తిలో నల్లమిల్లి అనుచరులు భగ్గుమన్నారు. నల్లమిల్లికే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ విషయంపై నల్లమిల్లి స్పందిస్తూ తన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది త్వరలో తెలియజేస్తానని స్పష్టం చేశారు.
ఇక ఎచ్చెర్ల నుంచి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళావెంకట్రావు టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఎచ్చెర్ల టికెట్ బీజేపీకి కేటాయించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకట్రావు తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని వెల్లడించారు.ఇక ధర్మవరం నుంచి బీజేపీ నేత వరదాపురం సూరి, టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్ టికెట్లు ఆశించారు. ఇక వీరిద్దరికీ కాకుండా అనూహ్యంగా బీజేపీ నుంచి ధర్మవరంలో వై.సత్యకుమార్ పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. దీంతో సూరి, శ్రీరామ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.
విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన పోతిన మహేష్కు బీజేపీ లిస్టుతో షాక్ తగిలింది. విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరిని అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. విజయవాడ వెస్ట్ సీటు కోసం పోతిన తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇలా ఈ స్థానాలలో అనుకున్నవారికి టికెట్ రాకపోవడంతో తెలుగు తమ్ముళ్లు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.