ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిమాని ఒకతను పదేళ్ల తర్వాత కాళ్లకు చెప్పులు తొడుక్కున్నాడు. జగన్ను ముఖ్యమంత్రిగా చూసి, ఆయనతో కలిసేవరకు చెప్పులు ధరించబోనని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. దూదేకుల కాశీం అనే వ్యక్తి ఎనాటికైనా జగన్ను కలుసుకుంటానని, తన కల నెరవేరుతుందని భావించాడు. ఆయన కల నెరవేరింది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా ఆయనకు జగన్ను కలిసే అవకాశం దక్కింది.
జగన్ అంటే ఎనలేని అభిమానమని 45 ఏళ్ల వయస్సు గల కాశీం అన్నాడు. అతను నంద్యాల జిల్లా కానాల గ్రామానికి చెందినవాడు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే కూడా ఆయనకు అభిమానం. జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రలో తాను పాల్గొన్నానని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించేవరకు చెప్పుల తొడుక్కోబోనని ప్రతిజ్ఞ చేశానని ఆయన చెప్పాడు.
వ్యవసాయ కూలీ అయిన కాశీం ఎంతటి కష్టం ఎదురైనప్పటికీ పదేళ్ల పాటు చెప్పులు ధరించలేదు. వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఆయనను కలుసుకునేంత వరకు చెప్పులు ధరించబోనంటూ ఉత్త కాళ్లతోనే నడక సాగించాడు.
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వైఎస్ జగన్ నంద్యాలకు వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కలిసే అవకాశం కాశీంకు వచ్చింది. కాశీంకు వైఎస్ జగన్ కొత్త చెప్పులు ఇచ్చారు. తీవ్రమైన భావోద్వేగానికి గురైన కాశీం జగన్కు ధన్యవాదాలు తెలిపాడు.
కృష్ణుడికీ కుచేలుడికి మధ్య ఉన్న అనుబంధాన్ని, వారి కలయికను.. జగన్ను కాశీం కలిసిన సంఘటన గుర్తు చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.