చంద్రబాబుది మోసపూరిత రాజకీయమని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటికే అందిస్తున్న వలంటీర్ వ్యవస్థను దెబ్బతీయడానికే బాబు కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే చంద్రబాబు గిట్టదని ఆయన విమర్శించారు. ఒక రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా? అంటూ నిలదీశారు. చంద్రబాబు తన ఒరిజినల్ క్యారెక్టర్ని ఇప్పుడు చూపిస్తున్నారని సజ్జల దుయ్యబట్టారు. తాడేపల్లిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్ష కట్టారని సజ్జల విమర్శించారు. వలంటీర్లపై ఆయన పూటకో మాట మాట్లాడుతున్నాడని గుర్తుచేశారు. నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు తరపున పనిచేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సిటిజన్ ఫర్ డెమొక్రసీలో ఉండేది చంద్రబాబు మనుషులేనని, తానొస్తే ఈ వ్యవస్థలు ఏమీ ఉండవని ఈ విధంగా చంద్రబాబు మెసేజ్ ఇచ్చారని తెలిపారు. అయినా వృద్ధులు, వికలాంగులను ఇబ్బంది పెడితే మీకు ఏమొస్తుంది.. చంద్రబాబు విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడు కాదు.. అంటూ సజ్జల ధ్వజమెత్తారు.
జనసేన సీట్లలోనూ బాబు మనుషులే..
పవన్కు ఇచ్చిన సీట్లలోనూ చంద్రబాబు మనుషులే ఉన్నారని ఈ సందర్భంగా సజ్జల తెలిపారు. పవన్ను చంద్రబాబు మింగేస్తాడని తాము ముందే చెప్పామని ఆయన గుర్తుచేశారు. ఇష్టం లేకుండా పవన్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారని సజ్జల చెప్పారు. సీఎం సీఎం.. అనే పరిస్థితి నుంచి చివరికి 21 సీట్లకే పవన్ పరిమితమయ్యాడని ఆయన తెలిపారు. బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. టీడీపీలో జెండా ఎత్తేసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబుకు అర్థమైందని, అందుకే చౌకబారు మాటలు, దూషణలతో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు అత్యంత కీలకమని, కుట్రలు చేసే వారెవరో, మేలు చేసే వారెవరో ప్రజలకు అర్థమైందని చెప్పారు. ప్రతి ఇంట్లో ఉన్న లబ్ధిదారులే వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లని సజ్జల తెలిపారు.
పింఛన్లపై ఆందోళనొద్దు.
పింఛన్ల పంపిణీపై లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన పని లేదని, సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్లు అందజేస్తామని ఆయన చెప్పారు. లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి పింఛన్లు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. మూడో తేదీన పింఛన్లు అందిస్తామని ఆయన చెప్పారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేయాలంటూ ఎన్నికల సంఘానికి బాబు లేఖ రాశారని, మరి సచివాలయ సిబ్బందిని కూడా జగనే నియమించారు కదా అని సజ్జల ప్రశ్నించారు.