వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికారం చేపట్టి, మూడోసారి పీఠం దక్కించుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది బీజేపీ. దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించే బీజేపీకి దక్షిణాది మాత్రం కొరకరాని కొయ్యే. ఒక్క కర్ణాటకలో తప్ప మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీ పట్టు అంతంతమాత్రమే. అయితే ఈసారి పరిస్థితి మారబోతందని, దక్షిణాదిలోనూ సత్తా చాటతామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
మెజార్టీ సీట్లు మాకే..
దక్షిణాదిలోని 5 రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సైతం రానున్న ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాదిలో ఉన్న మొత్తం 130 లోక్సభ స్థానాల్లో మెజార్టీ స్థానాలను బీజేపీ అభ్యర్థులు కైవసం చేసుకుంటారని రాజ్నాథ్ విశ్వాసం ప్రకటించారు.
కర్ణాటకలో క్లీన్స్వీప్ చేస్తాం.
ఎన్నికల్లో బీజేపీ 370 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకొందని.. అందులో దక్షిణాదిలో గెలుచే స్థానాలే కీలక పాత్ర పోషిస్తాయని రాజ్నాథ్ చెప్పారు. నిరుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినప్పటికీ.. లోక్సభ ఎన్నికల్లో మాత్రం విజయం ఖాయమన్నారు. జేడీఎస్తో పొత్తు పెట్టుకోవడంతో తమ బలం పెరిగిందని, కర్ణాటకలో తమ కూటమి మొత్తం 28 లోక్సభ స్థానాల్నీ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు.
ప్రతి రాష్ట్రంలోనూ పాగా వేస్తాం
గతంలో తమిళనాడు, కేరళలో మెజార్టీ స్థానాలు గెలుచుకోలేకపోయినప్పటికీ.. ఈసారి మాత్రం ఎక్కువ స్థానాల్లో గెలుస్తామని రాజ్నాథ్ చెప్పుకొచ్చారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రతీ రాష్ట్రంలో బీజేపీ స్థానాలను గెలుచుకొంటుందన్నారు.