తన ప్రభుత్వ హయాంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీకటిమయం చేశారు. పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పాటు పవర్ హాలిడే అన్నారు. వారాంతపు సెలవుతో కలిసి మూడు రోజులు పరిశ్రమలకు విద్యుత్తు సరఫరా నిలిపేశారు. గ్రామాల్లో ఎనిమిది గంటలు, పట్టణాల్లో ఆరు గంటలు, నగరాల్లో నాలుగు గంటలు ఎమర్జెన్సీ లోడ్ విధిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్తు ఇవ్వడం కష్టమని, నాలుగు గంటలు రెండు విడతల్లో ఇస్తామని చెప్పారు. క్రాప్ హాలిడే తీసుకుంటే మంచిదని కూడా సూచన చేశారు. మొత్తంగా రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపించారు.
చంద్రబాబు నిర్వాకం వల్ల రైతులు అర్థరాత్రి అపరాత్రి తేడా లేకుండా విద్యుత్తు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక పొలాల్లనే పడిగాపులు కాసే పరిస్థితిని ఎదుర్కున్నారు. దాంతో చంద్రబాబు రైతుల ఉసురుపోసుకున్నారు. కొన్ని సీజన్లలో విద్యుత్తు సరఫరా లేక క్రాప్ హాలిడే పేరుతో పంటలు వేసుకోకుండా భూములను పడావు పెట్టారు. ఈ కష్టాల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులను గట్టెక్కించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశారు.
జగన్ ప్రభుత్వం రైతులకు పగటి పూటనే ఉచితంగా 9 గంటలు విద్యుత్తును అందిస్తోంది. భారీగా విద్యుత్తు డిమాండ్, తీవ్రమైన విద్యుత్తు కొరత ఉన్న వేసవిలో కూడా ఏ విధమైన కోతలు లేకుండా విద్యుత్తును అందిస్తోంది. లోడ్ రిలీఫ్ అవసరం రాకుండా, క్రాప్ హాలిడే విధించకుండా, పవర్ హాలిడే పెట్టకుండా అన్ని వర్గాలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తోంది.
అయితే, టీడీపీ, ఎల్లో మీడియా మాత్రం జగన్ ప్రభుత్వ హయాంలో విద్యుత్తు కొరతతో రాష్ట్రం అల్లాడుతోందని పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు మీద ఉన్న మమకారంతో, చంద్రబాబు ఓడిపోతే తమకు పుట్టగతులు ఉండవనే భయంతో ఎల్లో మీడియా దుష్ప్రచారానికి ఒడిగడుతోంది.