ఎన్నికల సమీపిస్తున్నవేళ ఆంధ్రప్రదేశ్లో నేతల ప్రచారం ఊపందుకుంటోంది. ఈ క్రమంలోనే తమ ప్రసంగాల్లో భాగంగా వైరి పక్షాలపై నేతలు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎన్నికల కమిషన్ నిబంధనలకు కూడా అతిక్రమించి ఆధారాలు లేని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ప్రసంగాలు చేసిన పలువురు నేతలకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్కి కూడా ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది.
అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల కమిషన్ తాజా నోటీసులు జారీ చేసింది. బుధవారం ఈ నోటీసులు పవన్కు అందించింది. ఇంతకీ పవన్ అనకాపల్లి సభలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి ఏమన్నారంటే.. స్కాం స్టార్, ల్యాండ్ గ్రాబర్, శాండ్ అండ్ లిక్కర్ ఎంపరర్.. ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసులిచ్చింది.
పవన్ చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 8వ తేదీన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను పరిశీలించిన ఎన్నికల కమిషన్.. దానిపై వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్కు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. 48 గంటల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది. లేదంటే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.