ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి కుమ్మక్కయ్యారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. విచారణ వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరడం చూస్తేనే విషయం అర్థమవుతోందన్నారు. గతంలో చంద్రబాబు ఆదేశాల మేరకు నాడు టీడీపీలో ఉన్న రేవంత్రెడ్డి రూ.5 కోట్లకు బేరం కుదుర్చుకొని రూ.50 లక్షలు బయానాగా ఇచ్చిన విషయాన్ని దేశం మొత్తం స్పష్టంగా చూసిందన్నారు.
ఓటుకు నోటు కేసులో 2017లో తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానన్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అన్ని సాక్షాలు ఉన్నా.. అనేక సాకులతో చంద్రబాబు న్యాయవాదులు కేసును సాగదీస్తూ వచ్చారని ఆరోపించారు. ఈసారి తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కూడా వాయిదా కోరడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తెలంగాణ న్యాయవాదులకు, బాబు న్యాయవాదులు వత్తాసు పలకడం చూస్తుంటే చంద్రబాబు, రేవంత్రెడ్డి కుమ్మక్కైనట్టు ఇట్టే తెలిసిపోతోందన్నారు. జూలై 24 నుంచి వాదనలు మళ్లీ మొదలవుతయన్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. కేసు నుంచి వారిద్దరూ తప్పించుకోలేరని.. చంద్రబాబుకు శిక్ష తప్పదన్నారు.