మెగాస్టార్ చిరంజీవి తన అసలు రంగును బయటపెట్టుకున్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, సినిమాలే తన జీవితమని ప్రకటించిన ఆయన ఇప్పుడు తమ్ముడు పవన్ కల్యాణ్ కోసం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కోసం పచ్చ రంగు పులుముకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఆయన ఎన్డీఏకు జైకొట్టారు. ఆయన ఏఐసీసీ సభ్యుడు కూడా. ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ప్రత్యర్థులకు ఆయన వంత పాడడం అవకాశవాదం తప్ప మరేమీ కాదు.
తమ్ముడి రాజకీయాలతో తనకు సంబంధం లేదని కూడా గతంలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ను, పెందుర్తి ఎమ్మెల్యేగా పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలని ఆయన పిలుపునిచ్చి తన రంగును బయటపెట్టుకున్నారు. పంచకర్ల రమేష్ బాబు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. సీఎం రమేష్ బీజేపీ తరఫున పోటీ చేస్తుండగా పంచకర్ల రమేష్ టీడీపీలో చేరి పెందుర్తి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరి విజయం చిరంజీవికి ఎందుకు అంత ప్రధానమైందో తెలియదు. కానీ చిరంజీవి తన ద్వంద్వ వైఖరిని మాత్రం బయటపెట్టుకున్నారు.
టికెట్ రేట్ల పెంపు వంటి సినీ పరిశ్రమ సమస్యలపై చిరంజీవి గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. చిరంజీవి అడిగిందే తడువుగా జగన్ సానుకూలంగా స్పందించారు. తనకు జగన్ ఓ సోదరుడు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. కీలకమైన సమయంలో ఆయన ప్లేటు ఫిరాయించారు. చిరంజీవి ఇద్దరి పేర్లనే ప్రస్తావించినా ఆయన మద్దతు ఎన్డీఏకు ఉందనేది అందరికీ అర్థమవుతుంది.
గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా అవమానించారు. పార్టీని మూసే వరకు వెంటాడారు. చిరంజీవిపై టీడీపీ అనుకూల మీడియా తీవ్రంగా విరుచుకుపడింది. అయినప్పటికీ ఆయన టీడీపీకి వంత పాడుతున్నారు. తాను పెద్ద మనిషిని కాదని చిరంజీవి రుజువు చేసుకున్నారు.