రాయలసీమలో 90 శాతం పైగా స్థానాల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కుప్పం, పిఠాపురంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్లను ఓడించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. పుంగనూరు మున్సిపాలిటీలో సోమవారం ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ మేనిఫెస్టోలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేయగలిగిన హామీలు మాత్రమే ఇచ్చారని మంత్రి చెప్పారు. తమ మేనిఫెస్టో ప్రజలందరి ఆమోదం పొందుతున్నదని ఆయన తెలిపారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% అమలు చేశామని గుర్తుచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి జూన్ తర్వాత రెండోసారి జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం ఖాయమని ఆయన చెప్పారు.
రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్కుమార్రెడ్డికి నైతికత లేదని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. గతంలో అసెంబ్లీలో కిరణ్ మాట్లాడుతూ.. తాను తెలంగాణ బిడ్డనని, ఇక్కడే జన్మించానని చెప్పిన వ్యక్తి.. ఇప్పుడు ఏపీలో పోటీ చేయడం హాస్యాస్పదమని చెప్పారు. రాజంపేట ఎన్నికల్లో మిథున్రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని స్పష్టం చేశారు.