టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు కూటమి మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలను ఇబ్బడి ముబ్బడిగా గుప్పించారు. లెక్కాపత్రం లేకుండా ప్రజలను మభ్యపెట్టడానికి హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేస్తే అయ్యే ఖర్చు దిమ్మతిరిగే విధంగా ఉంది. సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీలంక, వెనిజులా చేస్తున్నారని విమర్శించిన చంద్రబాబు.. చేతికి ఎముకే లేదన్నట్లుగా వరాల వర్షం కురిపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం ఆయన రక్తంలో లేదు కాబట్టి అనుకుంటే సరిపోతుంది. కానీ వాటి అమలుకయ్యే ఖర్చును చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. అయితే, ప్రజలు ఆయన హామీల మాయలో పడితే మాత్రం రాష్ట్రానికి పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుంది. ప్రజలు దిక్కూమొక్కూ లేక అల్లాడిపోవాల్సి వస్తుంది.
చంద్రబాబు ఇచ్చిన హామీల్లో కొన్నింటిని మాత్రమే విశ్లేషిద్దాం. వీటికయ్యే ఖర్చును చూస్తే మిగతా హామీల అమలుకు ఎంత ఖర్చవుతుందో ఒక అంచనాకు రావచ్చు. ఉదాహరణకు.. అగ్రవర్ణాలకు కాకుండా 50 ఏళ్లు దాటిన మిగతా వర్గాలవారికి నెలకు 4000 రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం 50 ఏళ్లు దాటిన ఆ వర్గాలవారు కోటిన్నర మంది ఉన్నారు. ఈ లెక్కన వారికి నెలకు 4 వేల రూపాయల చొప్పున పింఛను ఇస్తే రూ.1,50,00,000 కోట్లు అవుతుంది. అంటే సంవత్సరానికి 72 వేల కోట్ల రూపాయలు కావాలి.
దాదాపుగా రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు ఉంటుంది. ఇందులో 35 శాతం పింఛన్లకే పోతే మిగిలిన పథకాల అమలుకు చంద్రబాబు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు? జీతాలకు, సాధారణ పరిపాలనకు నిధులు ఎక్కడి నుంచి తెస్తాడు?
అదే విధంగా 18 ఏళ్ల వయస్సు దాటిన మహిళలకు నెలకు 1500 రూపాయల కానుక ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. 18 ఏళ్ల వయస్సు దాటిన మహిళలు రాష్ట్రంలో రెండు కోట్ల మంది ఉన్నారు. వీరందరికీ ఆ సొమ్ము ఇస్తే నెలకు 3 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అంటే, ఏడాదికి 36 వేల కోట్ల కావాలి. ఈ నిధులను ఎక్కడి నుంచి చంద్రబాబు తెస్తాడు?
ప్రతి రైతుకు రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తానని, ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తానని చంద్రబాబు చెప్పారు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ముస్లిం మైనారిటీలకు, ఇతర మైనారిటీలకు కూడా ఆయన ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయడం సాధ్యమవుతుందా, లేదా అనే ఆలోచన కూడా ఆయనకు లేదు.
ఇచ్చిన హామీలను అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారంటే సంపద సృష్టిస్తానని అంటారు. ఈ సంపద ఎలా సృష్టిస్తారంటే నిర్దిష్టమైన సమాధానం ఉండదు. తాను చాలా చేశానని అంటూ కియా, తెలంగాణలో హైటెక్ సిటీ వంటివాటిని ఏకరువు పెడుతారు. సంపద సృష్టించడమనేది చంద్రబాబు వల్ల అయ్యే పని కాదని తేలిపోయింది. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న ఆయన ఎంత సంపద సృష్టించారు? ఏమీ లేదు.
ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని అమరావతి వంటి పథకాల ద్వారా తనవారికి దోచిపెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ వంటి ద్వారా అవినీతికి పాల్పడ్డారు. తనకు, తనవారికి ప్రయోజనం చేకూర్చడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి తూతూ మంత్రం చేశాడు. డ్వాక్రా మహిళలను రుణాల విషయంలో నిలువునా ముంచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలయ్యేవి కావని అర్థం చేసుకోవడానికి పెద్దగా విశ్లేషణ కూడా అక్కర్లేదు. ఆయనది మోసాల చరిత్ర. ఈ మోసాల చిట్టాను విప్పితే ఇప్పుడు ఇచ్చిన హామీలకు ఏపాటి ప్రాధాన్యం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.