టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విడుదల చేసిన కూటమి మేనిఫెస్టోపై బీజేపీ నేతలు పెదవి విరుస్తున్నారు. ఆ మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని ప్రకటిస్తున్నారు. కూటమిలో తాము ఉన్నప్పటికీ మేనిఫెస్టోను బీజేపీ సొంతం చేసుకోకపోవడం చంద్రబాబుకు పెద్ద దెబ్బనే. అంతేకాకుండా ఆ మేనిఫెస్టోకు వ్యతిరేకంగా ప్రకటనలు కూడా చేస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కావనే ఉద్దేశంతోనే వారు దూరమైనట్లు అర్థమవుతోంది.
ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ హామీల విషయంలో స్టేటస్ కో పాటించడాన్ని బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ ప్రశంసించారు కూడా. మేనిఫెస్టోపై బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణా రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన కలిసి విడుదల చేసిన మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదని ఆయన చెప్పారు. మేనిఫెస్టోలో సాధ్యం కాని, అలవి కాని హామీలున్నాయని ఆయన విమర్శించారు.
అది జనసేన మద్దతుతో టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో మాత్రమేనని జీవిఎల్ నరసింహారావు అన్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో ఇప్పటికే మేనిఫెస్టోను విడుదల చేసిందని ఆయన గుర్తు చేశారు. బీజేపీకి జాతీయ విధానం ఉంది కాబట్టి ఏపీలో విడుదల చేసిన మేనిఫెస్టోలో తాము పాలు పంచుకోదలుచుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
ఏపీలో విడుదల చేసిన మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ను రాష్ట్రంలో సరిగా వాడుకోవడం లేదని ఆయన అన్నారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో తమ పార్టీ విధానం మారదని ఆయన చెప్పారు. మొత్తం మీద, ముస్లిం మైనారిటీల పట్ల వైఖరితోనే కాకుండా మేనిఫెస్టో విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరి చంద్రబాబును దెబ్బ తీసే విధంగా ఉంది.