ముస్లిం మైనార్టీలను ప్రోత్సహించాలని ఓ రిటైర్డ్ అధికారిని ప్రోత్సహిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే మస్కా కొట్టి వైసీపీ ఆశలు, ఆశయాలను వమ్ము చేశారు. రాయలసీమ ఐజీగా పనిచేసి పదవీ విరమణ పొందిన నెలరోజుల్లోపే పార్టీలోకి చేర్చుకుని పదవులతోపాటు రెండు సార్లు ఎమ్మెల్సీ ఇచ్చి వైఎస్ జగన్ ప్రత్యేక గుర్తింపు ఇచ్చినా వైసీపీని వీడి టీడీపీలో చేసి వైసీపీకి వ్యతిరేకంగా ప్రచార చేయడం విమర్శలకు తావిస్తోంది. ఆ అధికారి ఎవరో కాదు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం శాసనసభ వైసీపీ ఇన్చార్జిగా పనిచేసి.. ప్రస్తుతం టీడీపీలో చేరిన ఆయన పరిస్థితి రెండిటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఇక్బాల్ను ప్రస్తుతం టీడీపీలో ఎవరు పట్టించుకోకపోవడం, ఎన్నికల ప్రచారం కోసం హిందూపురంలో పర్యటించినా.. సినీ నటుడు బాలకృష్ణ పట్టించుకోలేదని విమర్శలున్నాయి. హిందూపురంలో ముస్లిం మైనార్టీలు పట్టున్న వార్డుల్లో ఇక్బాల్ పర్యటించినా ఏ మాత్రం ప్రభావం లేదని, వైసీపీలో ఉన్నప్పుడు ఆయన మద్దతుదారులుగా ఉన్న ముస్లిం మైనార్టీ నాయకులు ఎవరు ఇక్బాల్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరలేదు.
హిందూపురంలోనే ఇక్బాల్ ప్రభావం అలా ఉంటే ఇక మిగతా జిల్లాల్లో ప్రచారం చేసినా ఏం లాభం ఉంటుందని టీడీపీ వర్గీయులు చర్చించుకుంటున్నారు. ఎంతో ప్రాధాన్యత ఇచ్చి పార్టీలో గుర్తింపు ఇచ్చిన వైసీపీ అధినేత, సీఎం జగన్ని మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ ధిక్కరించడాన్ని హిందూపురం ప్రాంత వైసీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతుంది. 2019 శాసనసభ ఎన్నికలకు ముందు రాయలసీమ పోలీస్ ఐజీగా మహమ్మద్ ఇక్బాల్ పదవీవిరమణ పొందారు. పదవీవిరమణ పొందిన కొద్ది నెలలకు వైసీపీ చేరారు. పార్టీలో చేరిన కొద్ది రోజులకే రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఆ తర్వాత హిందూపురం నియోజకవర్గంలో వైసీపీలో గ్రూపు రాజకీయాలను, మెజార్టీ ముస్లిం మైనార్టీ ఓట్లను దృష్టిలో ఉంచుకొని వైసీపీ ఇన్చార్జిగా నియమించారు.
2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పోటీగా వైసీపీ అభ్యర్థిగా ఇక్బాల్ను వ్యూహాత్మకంగా బరిలో దింపారు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవీకాలం మళ్లీ ముగిసిన తర్వాత రెండోసారి కూడా పదవి ఇచ్చారు. రెండోసారి ఇచ్చిన ఎమ్మెల్సీ పదవీకాలం 2027 వరకు ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు సర్వేల ద్వారా వివిధ నియోజకవర్గ ఇన్చార్జిలను మార్చినట్లే హిందూపురం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఇక్బాల్ మార్చి ఆయన స్థానంలో కురుబ దీపికను నియమించారు. ప్రస్తుతం ఆమె వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తనకు టికెట్ ఇవ్వలేదని, కలిసేందుకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని కారణం చెబుతూ మహ్మద్ ఇక్బాల్ వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
హిందూపురం నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా ఉన్నప్పుడు ఆయన పీఏల ద్వారా అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక వైసీపీ ముఖ్యుడు ప్రత్యేకంగా ఇక్బాల్ను ప్రోత్సహించేందుకు ఒక కారు కూడా బహుమతిగా ఇచ్చారని, నెలనెలా ఖర్చుల కోసం కొంత డబ్బు కూడా పార్టీ తరఫున ప్రత్యేకంగా ఇచ్చినట్లు కూడా తెలియ వచ్చింది. ఈ విధంగా వివిధ రూపాల్లో ఎమ్మెల్సీ ఇక్బాల్ను వైసీపీ ప్రోత్సహించినా ప్రస్తుతం ఆ పార్టీపైనే , పార్టీ నేతల పైన విష ప్రచారం చేయడం విమర్శలు తావిస్తోంది. ఎమ్మెల్సీ ఇక్బాల్ ఏం చెప్పినా ముస్లిం మైనార్టీలు వినే స్థితిలో లేరని, ఏ పార్టీ ముస్లిం మైనార్టీలకు అండగా ఉందో వారికి స్పష్టంగా తెలుసని పలువురు నేతలు బల్ల గుద్ది చెబుతున్నారు.