తమ కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం మైనారిటీలకు ఏ విధమైన సమస్య కూడా ఉండదని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు. ముస్లిం రిజర్వేషన్లపై తమ మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఇటీవల నొచ్చుకున్నారు. కానీ చంద్రబాబు మాటలను నమ్మడానికి ఏ మాత్రం అవకాశం లేదని పవన్ కల్యాణ్ మాటలు తెలియజేస్తున్నాయి. ముస్లిం రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని పవన్ కల్యాణ్ చెప్పేశారు. అందువల్ల చంద్రబాబు హామీ ఇచ్చినా బీజేపీ గానీ జనసేన గానీ ముస్లిం రిజర్వేషన్లను అమలు చేయకుండా అడ్డుకుంటాయని అర్థమైపోతోంది.
ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ పూర్తి మద్దతు ప్రకటించారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని అన్నారు. అయితే, ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని బీజేపీ నేతలు అంటున్నారు కదా అని గుర్తు చేస్తే ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతల ప్రకటనపై తానేమీ నిరాశ, ఆందోళన చెందడం లేదని ఆయన అన్నారు.
మైనారిటీల ప్రాథమిక హక్కులకు తాను అండగా ఉంటానని ఆయన అన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం యూసీసీ, సీఏఏలను తెస్తుంటే పవన్ కల్యాణ్ వారి ప్రాథమిక హక్కులను ఎలా కాపాడుతారనేది ప్రశ్న. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీ విధానాలనే పవన్ కల్యాణ్ సమర్థించాల్సి ఉంటుంది, సమర్థిస్తున్నారు కూడా.
బీజేపీని అన్ని విధాలుగా బలపరుస్తున్న పవన్ కల్యాణ్ ముస్లిం రిజర్వేషన్ల కోసం నిలబడుతారనే గ్యారంటీ ఏమీలేదు. పైగా వారికి రిజర్వేషన్లు అవసరం లేదనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. ముస్లిం మైనారిటీల హక్కులను కాపాడుతానని, ముస్లిం రిజర్వేషన్ల కోసం పోరాడుతానని చంద్రబాబు అంటున్నారు. ఇవి నమ్మే విషయాలేమీ కావు. చంద్రబాబుకు చెప్పిన మాట మీద నిలబడే అలవాటు లేదు.