రాష్ట్రంలో రాజకీయాలు భలేగా ఉన్నాయి. ముఖ్యంగా మూడు పార్టీల మధ్య రాజకీయం దాగుడుమూతలు ఆడుతోంది. బీజేపీ, జనసేన మిత్రపక్షాలు. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణేమో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో కలిసి వెళ్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం బీజేపీ లేకుండా జనసేన ఒక్కదానితోనే పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళటానికి భయపడతున్నారు. జనసేనతో పాటు బీజేపీ కూడా వస్తేనే బాగుంటుందని ఎదురు చూస్తున్నారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవటానికి కమలం పార్టీ జాతీయ నాయకత్వం ఏమాత్రం సిద్ధంగా లేదు.
అయితే ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం టీడీపీతో పొత్తుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్ల కారణంగా రాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా తయారయ్యాయి. ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో తెలియదు. ఏ రెండు పార్టీల మధ్య పొత్తుంటుందో కూడా స్పష్టత రావటంలేదు. దీనివల్ల టీడీపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే టీడీపీ, జనసేన పొత్తులో సీట్లను చంద్రబాబు, పవన్ అధికారికంగా ప్రకటన చేయలేకపోతున్నారు. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది? ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తుందనే విషయాన్ని ప్రకటించటానికి వెనకాడుతున్నాయి.
దీనివల్ల రెండు పార్టీల్లోనూ తీవ్ర గందరగోళం పెరిగిపోతోంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రచారం చేసుకోమంటున్నారు. సిద్ధం పేరుతో బహిరంగసభలకు జగన్ రెడీ అయిపోయారు. భీమిలీలో మొదటి బహిరంగసభ జరిపి ఏలూరులో రెండో సభలో శనివారం పాల్గొనబోతున్నారు. ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరి పోటీకి రెడీ అయిపోయిన జగన్ మాత్రం హ్యాపీగా ఉన్నారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కుక్క తోకను ఊపాలి కాని తోక కుక్కను ఊపకూడదనే ముతక సామెత చెప్పినట్లుగా టీడీపీ, జనసేనలను బీజేపీ ఒక ఆటాడుకుంటోంది. కనీసం 1 శాతం ఓట్ షేర్ కూడా లేని పార్టీ టీడీపీ లాంటి పెద్దపార్టీని అయోమయంలోకి నెట్టేస్తోందంటేనే విచిత్రంగా ఉంది. పొత్తు విషయంలో బీజేపీ స్పందన చూసుకుని రెండు మూడు రోజుల్లో టికెట్లను ప్రకటించాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించటమే విచిత్రంగా ఉంది. ఇందుకోసమని 4వ తేదీన జరగాల్సిన బహిరంగసభలను కూడా చంద్రబాబు, పవన్ రద్దు చేసుకోవటమే దీనికి నిదర్శనం. మొత్తానికి టీడీపీతో పొత్తుపై ఎలాంటి ప్రకటన చేయకుండానే బీజేపీ ఇద్దరినీ ఆడుకుంటోందని మాత్రం అర్థమైపోతోంది.