బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించకపోవడంపై అక్కడి తాత్కాలిక ప్రభుత్వం భారత్పై అసహనం వ్యక్తం చేసింది. విదేశీ వ్యవహారాల సలహాదారు ఎండీ తౌహిద్ హుస్సేన్ ఢాకాలో మీడియాతో మాట్లాడుతూ.. హసీనాను బంగ్లాకు రప్పించడానికి యూనస్ ప్రభుత్వం ఏమైనా చేస్తుందన్నారు. ఆమెను బంగ్లాకు అప్పగించాలని భారత్ను ఎన్నిసార్లు కోరినా జవాబు లేదని అసహనం వ్యక్తంచేశారు. హసీనాను అప్పగించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారత్ పైనే ఉందని వ్యాఖ్యానించారు.
తమ న్యాయ వ్యవస్థ తలుచుకుంటే హసీనాను ఎలాగైనా తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని తౌహిద్ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియా ఆయన్ని.. హసీనా భారత్లో ఎక్కడ తలదాచుకున్నారనే విషయం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించగా, ఆ విషయం భారత్నే అడగండంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోపక్క భారత్తో బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల విషయంలో హసీనా అప్పగింత అంశం కీలక పాత్ర పోషిస్తుందని బీఎస్పీ (బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ) ఇప్పటికే తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మిర్జా ఫబ్రూల్ ఇస్లాం ఆలంగీర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమెకు భారత్లోనే ఆశ్రయం కొనసాగితే భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని చెప్పారు. తమ పార్టీ (బీఎస్పీ) న్యూఢిల్లీతో బలమైన సంబంధాలను కోరుకుంటోందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
హసీనా హయాంలో రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనలకు సంబంధించి మొత్తంగా హసీనా ప్రస్తుతం 53 కేసులు ఎదుర్కొంటున్నారు. వీటిలో 44 హత్య కేసులు, మారణహోమానికి సంబంధించి ఏడు కేసులతో పాటు బీఎస్పీ ఊరేగింపు సమయంలో చోటుచేసుకున్న ఘర్షణలో ఆమెపై దాడి కేసు నమోదవడం గమనార్హం. ఆమెతో పాటు మాజీ మంత్రులు, అనుచరులపై పోలీసులు 31 కేసులు నమోదు చేశారు.