రెండు తెలుగురాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోగా.. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఏపీలో సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ జనానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అటు ప్రతిపక్ష నేత జగన్ సైతం తాము అండగా ఉంటామన్న భరోసా కల్పించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ వరద బాధితుల కోసం అండగా నిలబడ్డాయి. ఐతే ఈ సారి తెలుగు రాష్ట్రాల నుంచి గణనీయమైన సీట్లు సాధించిన బీజేపీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలతో పాటు 8 మంది ఎంపీలు గెలిచారు. ఏపీలో 8 మంది ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఎంపీలు కాషాయ పార్టీ తరపున గెలిచారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలోనూ బీజేపీ భాగస్వామిగా ఉంది. రెండు రాష్ట్రాల నుంచి ముగ్గురు బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, శ్రీనివాస వర్మ కేంద్రమంత్రులుగా ఉన్నారు. కానీ గత మూడు, నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాలు వరదలతో అల్లాడుతుంటే ఒక్కరూ స్పందించలేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ, అమిత్ షా ఫోన్ చేసి అండగా ఉంటామని మాటలు చెప్పడం తప్పితే ఇక్కడ గెలిచిన బీజేపీ నేతల వల్ల ఇప్పటివరకూ ఒరిగిందేం లేదు. ఏ ఒక్కరూ క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసానిచ్చిన దాఖలాల్లేవు.
ఇప్పుడు సోషల్మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. బీజేపీ నేతల నుంచి కనీస స్పందన లేకపోవడంపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ వరదలు వచ్చినప్పుడు తెలుగురాష్ట్రాలకు కేంద్రం పెద్దగా సాయం చేసిందేమి లేదని, బీజేపీ నేతలు కేవలం మాటలకు పరిమితమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈసారి పెద్ద సంఖ్యలో ఎంపీలను, ఎమ్మెల్యేలను గెలిపించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని అంటున్నారు.