ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్కల్యాణ్ ఎట్టకేలకు బయటకొచ్చారు. విజయవాడ నగరం వరదల్లో చిక్కుకుంటే నాలుగు రోజులుగా కనిపించట్లేదని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పవన్, ఇవాళ దర్శనమిచ్చారు. హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న పవన్కల్యాణ్.. అక్కడి నుంచి కుంచనపల్లిలోని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఆఫీసుకు వెళ్లారు. విజయవాడలో వరద ప్రభావంపై అక్కడి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్.. ఇది నిందలకు సమయం కాదంటూనే.. గత ప్రభుత్వం వల్లే విజయవాడను వరద ముంచెత్తిందని ఆరోపించారు. గత ప్రభుత్వం బుడమేరును పూర్తిగా విస్మరించిందని, కనీసం లాకులు కూడా రిపేర్ చేయలేదని ఆరోపించారు. కృష్ణాలో మరో 10-12 వేల క్యూసెక్కుల వరద పెరిగి ఉంటే ఊహించడానికే భయంకరంగా ఉండేదని, భారీ ప్రమాదం తప్పిందన్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్, నేవీ ద్వారా సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని, అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తక్కువ సమయంలోనే ప్రభుత్వ శాఖలు చాలా ఎఫెక్టివ్గా పని చేశాయన్నారు. జిల్లాలకు ఇప్పటికే రూ.80 కోట్లు విడుదల చేశామని చెప్పారు.
గత నాలుగు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాలకు రాకపోవడాన్ని సమర్థించుకున్నారు పవన్కల్యాణ్. అధికారుల సూచనతోనే రాలేదని చెప్పారు. తాను వస్తే రెస్క్యూ ఆపరేషన్స్కు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తనకు సూచించారన్నారు. అధికారులకు తాను అదనపు భారం కాదల్చుకోలేదన్నారు పవన్. తాను వెళ్తే బాధితులు ఒకేసారి మీద పడే అవకాశం ఉందన్నారు. ఇక వ్యక్తిగతంగా వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి రూ. కోటి విరాళం ప్రకటించారు పవన్. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఏపీలోని ప్రతి నగరానికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామన్నారు. ఫ్లడ్ మేనేజ్మెంట్పై రాబోయే కేబినెట్ సమావేశంలో చర్చిస్తామన్నారు.