కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మూడు నెలల తరువాత వలంటీర్లకు పనిదొరికింది. వర్షాలు, వరదలతో విజయవాడ ప్రజలంతా అల్లాడిపోతున్న నేపథ్యంలో వలంటీర్ల సేవలను ఉపయోగించుకోవాలని కూటమి సర్కార్ డిసైడ్ అయ్యింది. వెంటనే వలంటీర్ల గ్రూప్లలో ఓ సందేశం ప్రత్యక్షమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వలంటీర్లంతా సంబంధిత అధికారులకు రిపోర్టు చేయాలని, బాధితులకు నిత్యావసరాలు, ఆహారం పంపిణీ చేసేందుకు వెంటనే విధుల్లో జాయిన్ అవ్వాలని, ఎవరైనా వలంటీర్లు రిపోర్టు చేయనిపక్షంలో వారిని తొలగిస్తామని హెచ్చరిస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చినట్లుగా సందేశం వారి గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లోని వలంటీర్లంతా విధుల్లో నిమగ్నమయ్యారు. మూడు నెలల తరువాత సర్కార్ నుంచి పిలుపు రావడంతో కాస్త నిట్టూర్పు ఉన్నప్పటికీ బాధితులకు సేవ చేయాలనే ఉద్దేశం, తమనిక కంటిన్యూ చేస్తారనే చిన్న ఆశతో వారంతా విధుల్లో చేరారు. ట్రాక్టర్లు ఎక్కి వరదల్లో చిక్కుకున్న వారికి వాటర్ బాటిళ్లు, పాలు, ఆహారం అందిస్తున్నారు. తమను ఇప్పటికైనా పిలిచినందుకు సంతోషం అని, విధుల్లో కంటిన్యూ చేస్తే ప్రజలకు సేవ చేసుకుంటామని అంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వలంటీర్లను పక్కనపెట్టేసింది. ఎన్నికల ముందు వలంటీర్ల వేతనం రూ.10 వేలు చేస్తానని మాటిచ్చిన చంద్రబాబు.. తరువాత వారిని పట్టించుకోలేదు. మాజీ సీఎం జగన్ తీసుకువచ్చిన వ్యవస్థ కావడంతో వారిని కంటిన్యూ చేయడం లేదనే వాదన ప్రస్పుటంగా ప్రతిబింబించేలా పెన్షన్ల పంపిణీ బాధ్యతను గ్రామ సచివాలయ సిబ్బందికి అప్పగించింది బాబు సర్కార్. దీంతో తమకు ఉపాధి లేనట్లేనని వలంటీర్లంతా భావించారు.
కానీ, ఆకస్మిక వరదలు విజయవాడను ముంచెత్తడం, సహాయక చర్యల్లో ఇబ్బందులు తలెత్తుతుండడం, బాధితులకు ఆహారం అందకపోవడం, మంచినీళ్ల కోసం అవస్థలు పడుతుండడంతో ప్రభుత్వం వలంటీర్లకు కబురంపింది. సేవ చేసేందుకు ముందుకు రావాలని కోరింది. మూడు నెలల తరువాత వలంటీర్లు విధుల్లో జాయిన్ అయ్యారు.