వర్షాలు, వరదలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రవాహం ఆగలేదు, జనం గోసలు తగ్గలేదు. ముంపు ప్రాంతాల ప్రజల అవస్థలు వర్ణణాతీతం. గొంతు తడుపుకునేందుకు గుక్కెడు మంచినీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. వరద నీటి నుంచి సురక్షిత ప్రాంతాలకు చేరేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో విజయవాడ వరద బాధితులను పరామర్శించేందుకు మరోసారి సిద్ధమయ్యారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.
నేడు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఓల్డ్ రాజరాజేశ్వరిపేట చేరుకుంటారు, అక్కడ వరద బాధితులను పరామర్శించనున్నారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ తాగునీరు, పాల ప్యాకెట్లు, ఆహారం పంపిణీ చేస్తున్నారు. వరద బాధితుల సహాయార్థం వైఎస్ జగన్ కోటి రూపాయల విరాళం కూడా ప్రకటించారు.
రెండ్రోజుల క్రితం సింగ్ నగర్లో వరద బాధితులను జగన్ పరామర్శించిన విషయం తెలిసిందే. జగన్ పర్యటన అనంతరం కూటమి ప్రభుత్వ పెద్దలంతా వరదల నెపాన్ని జగన్పై మోపే ప్రయత్నం చేశారు. బుడమేరు వాగును నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని సీఎం చంద్రబాబుతో సహా ప్రభుత్వ పెద్దలు ఒకరి తరువాత మరొకరు మైకుల ముందుకు వచ్చి గత వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేసి చేతులు దులుపుకున్నారు. మరోసారి జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు సిద్ధం కావడంతో ఈసారి ఏమని ఆరోపణలు చేస్తారో చూద్దామంటూ వైసీపీ నుంచి సెటైర్లు పేలుతున్నాయి.