భారత న్యాయవ్యవస్థలో ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చిన కొత్త నేర చట్టాల కింద తాజాగా తొలి శిక్ష పడింది. ఓ హత్య కేసుకు సంబంధించి బిహార్ న్యాయస్థానం ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. ఘటన జరిగిన 48 రోజుల్లోనే వారిని దోషులుగా తేల్చి శిక్ష ఖరారు చేయడం గమనార్హం. కొత్త నేర చట్టాలైన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్(బీఎస్ఏ) అమల్లోకి వచ్చిన తర్వాత ఇచ్చిన తొలి తీర్పు ఇదే కావడం విశేషం.
బిహార్లోని శరణ్ జిల్లాలో ధనాదిహ్ అనే గ్రామానికి చెందిన తారకేశ్వర్సింగ్ అనే వ్యక్తి కుటుంబంపై జూలై 17న దుండగులు దాడిచేశారు. డాబాపై నిద్రిస్తున్న వారిని విచక్షణారహితంగా పొడిచారు. ఈ ఘటనలో తారకేశ్వర్, అతని ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోగా, అతని భార్య తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. దాడికి పాల్పడిన సుధాన్షు కుమార్, అంకిత్లను పోలీసులు అరెస్టు చేశారు. దాడి జరిగిన 14 రోజుల్లోనే వీరిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం వీరిద్దరినీ దోషులుగా తేల్చుతూ తీర్పు వెలువరించింది. గురువారం వీరికి జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ.. కొత్త నేర చట్టాల కింద దేశంలో తొలి శిక్ష ఇదేనని వెల్లడించారు.