బీఆర్ఎస్ బీఫాం మీద గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటీషన్లపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ఆఫీసును ఆదేశించింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే కేసును సుమోటోగా తీసుకుని విచారిస్తామని పేర్కొంది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్, బీజేపీలు పిటీషన్లు దాఖలు చేశాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలంటూ పిటీషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి. దానంపై అనర్హత వేటు వేయాలని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించింది.
ఇప్పటికే 10 మందికిపైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కప్పుకోగా.. మరికొంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న వేళ ఈ తీర్పు బీఆర్ఎస్కు ఊరటనిచ్చినట్లయింది. కోర్టు తీర్పుతో తాత్కాలికంగా ఫిరాయింపులకు చెక్ పెట్టిట్లయింది. ఐతే హైకోర్టు తీర్పుతో స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.