ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ Vs కౌశిక్ రెడ్డి వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలకనిర్ణయం తీసుకుంది. అరికెపూడి గాంధీ తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్తుండడంతో ఆయన నివాసంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశానికి మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు హాజరవుతారని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఈ సమావేశానికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా హాజరవుతారని తెలిపింది.
బీఆర్ఎస్ నిర్ణయంతో కూకట్పల్లి వివేకానందనగర్లోని అరికెపూడి గాంధీ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. అర్ధరాత్రి నుంచే బీఆర్ఎస్ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేయడంతో పాటు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో ఇవాళ అరికెపూడి ఇంటి వద్ద ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.
PAC ఛైర్మన్ పదవి గాంధీకి ఇవ్వడంతో ఈ వివాదం రాజుకుంది. కాంగ్రెస్లో చేరిన గాంధీకి PAC ఎలా ఇస్తారని బీఆర్ఎస్ ప్రశ్నించగా.. తాను ప్రతిపక్షంలోనే ఉన్నానని కాంగ్రెస్లో చేరలేదని గాంధీ చెప్పారు. ఐతే బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని, ఇంటిపై గులాబీ జెండా ఎగురవేస్తానంటూ కౌశిక్ రెడ్డి కామెంట్స్ చేశారు. దీంతో రెచ్చిపోయిన గాంధీ.. భారీ కాన్వాయ్తో కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి హల్చల్ చేశారు. కౌశిక్ ఇంటిపై దాడి చేశారు. తర్వాత సైబరాబాద్ సీపీ ఆఫీసులో గాంధీపై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు.
సైబరాబాద్ సీపీ ఆఫీసు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హరీష్ రావు సహా బీఆర్ఎస్ కీలక నేతలను పోలీసులు అరెస్టు చేసి అర్ధరాత్రి వరకు రెండు వ్యాన్లలో తిప్పారు. ఓ వ్యాన్ను తలకొండపల్లి తరలించగా.. హరీష్ రావు సహా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్న వ్యాన్ను కేశంపేట వైపు తీసుకెళ్లారు. దీంతో అక్కడ పోలీస్ వ్యాన్ను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీస్ వ్యాన్ టైర్లో గాలి తీయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో పోలీసులు హరీష్ రావును కేశంపేట పోలీస్ స్టేషన్లో ఉంచారు. తర్వాత వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టడంతో అర్ధరాత్రి హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలను విడుదల చేశారు.