ఏపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఏ ఎమ్మెల్యే అయినా తన పార్టీ బలపడాలని, సొంతంగా ఎదగాలని కోరుకుంటారు. కానీ ఏపీలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్లో ఉంది. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఉన్నాయి. ఐతే వైసీపీని వీడి వస్తున్న నేతలు స్థానిక పరిస్థితులను బట్టి అటు టీడీపీలో గానీ, ఇటు జనసేనలో గానీ చేరుతున్నారు. కానీ బీజేపీలో మాత్రం ఎలాంటి చేరికలు లేవు. ఆ దిశగా ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేయకపోగా.. స్వయంగా వారే వైసీపీ నేతలను తెలుగుదేశం పార్టీలో చేర్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే!
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒకరు. ఐతే తాజాగా అనపర్తి నియోజకవర్గంలో పలువురు నేతలు వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరారు. వీరిలో ఓ కౌన్సిలర్ కూడా ఉన్నారు. ఐతే ఈ చేరికలన్నీ బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలోనే జరగడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
ఇది ఏపీలో బీజేపీ దయనీయ పరిస్థితికి అద్దం పడుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ..రాష్ట్ర హైకమాండ్ ఆ దిశగా ప్రయత్నాలు చేయట్లేదని బీజేపీ నేతలు సైతం చంద్రబాబు కనుసన్నల్లోనే పని చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. నిజానికి అసెంబ్లీ ఎన్నికల టైంలోనే చంద్రబాబు చాకచక్యంగా వ్యవహరించారు. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి కేటాయించిన స్థానాల్లో టీడీపీ నేతలనే జనసేన, బీజేపీలోకి పంపి సీట్లు ఇప్పించుకున్నారు. నల్లమిల్లి కూడా అలా సీటు దక్కించుకున్నవారే. జనసేన, బీజేపీ నుంచి గెలిచిన వారిలో మెజార్టీ నేతలు తెలుగుదేశం బ్యాగ్రౌండ్ ఉన్న వారే.