సెలవు కదా అని సంతోషంగా తాత ఇంటికి వెళుతున్న చిన్నారులను ప్రమాదం వెంటాడింది. అతి వేగంగా వస్తున్న ట్రావెల్స్ బస్సు వీరి బైక్ను ఢీకొనడంతో తాత, మనవరాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మనవడు తీవ్ర గాయాలపాలయ్యాడు. జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం పొలాస వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
రాయికల్ మండలం అల్లీపూర్కు చెందిన రైతు బైండ్ల లచ్చన్న (55). ఆయన అల్లుడు ఉపాధి కోసం గల్ఫ్కి వెళ్లగా, కుమార్తె ధర్మపురిలో ఉంటూ పిల్లలను చదివించుకుంటోంది. సోమవారం పాఠశాలకు సెలవు కావడంతో మనవరాలు నారవేణి శ్రీనిధి (9), మనవడు మల్లికార్జున్లను తీసుకొని తాత లచ్చన్న ఆదివారం సాయంత్రం బైక్పై తన గ్రామానికి బయలుదేరాడు. వారు పొలాస గ్రామానికి చేరుకునేసరికి కొండగట్టు నుంచి ధర్మపురికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆర్టీసీ బస్సును దాటే క్రమంలో ఎదురుగా వస్తున్న వీరిని, ముందు వెళుతున్న మరో బైక్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తాత లచ్చన్న, మనవరాలు శ్రీనిధిలను బస్సు 150 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో తాత, మనవరాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మనవడు మల్లికార్జున్ తీవ్రంగా గాయపడ్డాడు. మల్లికార్జున్ని జగిత్యాల జిల్లా కేంద్ర ఆస్పత్రికి, అక్కడి నుంచి కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
మరో బైక్పై వెళ్తున్న పొలాస గ్రామానికి చెందిన బనివెల్లి నర్సయ్య, బూర్ల రాజన్నలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలంలో రహదారిపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండడం చూపరులను కలచివేసింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపారు. జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్సై సదాకర్ ఘటనాస్థలిని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.