100 రోజుల పాలనతోటే సీఎం చంద్రబాబు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం అంటూ ఊరూవాడా పోస్టర్లు వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పార్టీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి పాంప్లేట్లు పంచి పెడుతున్నారు. ప్రతి ఇంటిపై ఇది మంచి ప్రభుత్వం అంటూ పోస్టర్లు అంటిస్తున్నారు. గతంలో జగన్ కూడా మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఇంటింటికీ స్టిక్కర్లు వేశారు. అప్పట్లో టీడీపీ నేతలు ఈ స్టిక్కర్ల వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు 100 రోజుల పాలనకే టీడీపీ కూడా స్టిక్కర్లు వేస్తోంది.
అయితే ఈ స్టిక్కర్ల వ్యవహారంలో చంద్రబాబు చాలా తెలివిగా వ్యవహరించారు. ఎక్కడా ఏ పార్టీ పేరు లేదు, ఏ పార్టీ రంగు కూడా లేదు. కానీ తన బ్రాండ్ అయిన విక్టరీ సింబల్ ని అందులో చొప్పించారు. ఇది మంచి ప్రభుత్వం అంటూ పోస్టర్లు వేశారు. వైసీపీ నుంచి అప్పుడే కౌంటర్లు పడుతున్నాయి. ఇది మంచి ప్రభుత్వం కాదని, ముంచే ప్రభుత్వం అంటున్నారు వైసీపీ నేతలు.
ఇకపై ప్రతి నెల ఒకటో తేదీన ‘పేదల సేవలో’ అనే కార్యక్రమం కూడా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు పేదల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకుని సహాయం అందించాలని సూచించారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో సీఎం పర్యటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై స్థానికులతో చర్చించారు. ఇకపై ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవలో పాల్గొంటామన్నారు చంద్రబాబు.