జానీ మాస్టర్ ని చంచల్ గూడ జైలుకి పంపించారు పోలీసులు. గోవాలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు ఈరోజు ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు 2 వారాల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్ గూడ జైలుకి తరలించారు. ఇక ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయని తెలుస్తోంది. జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నట్టు వార్తలొచ్చాయి.
రిమాండ్ రిపోర్ట్ లో ఏముందంటే..?
2019లో జానీతో బాధితురాలికి పరిచయం ఏర్పడిందని, దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్గా చేర్చుకున్నాడని పోలీసులు అంటున్నారు. 2020లో ముంబయిలోని హోటల్లో ఆమెపై లైంగిక దాడి చేశాడని, అప్పుడు బాధితురాలి వయసు 16ఏళ్లు అని, ఆమె మైనర్ అని తేలింది. ఈ నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని కూడా పోలీసులు నిర్థారించారు. అయితే ఈ విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడని, తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడని కూడా తేల్చారు. మరోవైపు జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
అంతకు ముందు అత్తాపుర్ లోని ఆస్పత్రిలో జానీ మాస్టర్ కి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల సమయంలో మీడియా వీడియోలు తీస్తుంటే జానీ మాస్టర్ అడ్డుకున్నారు. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని, బయటకొచ్చిన తర్వాత అందరి సంగతి తేలుస్తానని అన్నారు జానీ మాస్టర్.