తిరుమల లడ్డూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తిరుమల లడ్డూల తయారీకి వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి వాడారని, అందులో జంతువుల కొవ్వు కూడా కలిసిందనే ప్రచారం జరుగుతోంది. మాజీ సీఎం జగన్ కూడా దీనిపై వివరణ ఇచ్చారు. అయితే టీడీపీ నుంచి మాత్రం విమర్శలు తగ్గలేదు. ఈ దశలో వైసీపీ ఒకటే సూటి ప్రశ్న అడుగుతోంది. రిపోర్ట్ వచ్చి 2 నెలలైతే ఇప్పుడే ఎందుకు బయటపెట్టారంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కక్ష తీర్చుకోవడం కోసం జగన్ మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటినుంచి వైసీపీపై, జగన్ పై కక్ష సాధిస్తున్నారని ధ్వజమెత్తారు అంబటి. బుడమేరుకి వరద వస్తే జగన్పై తప్పుడు ప్రచారం చేశారని, జగన్ అంటే చంద్రబాబుకు ఎందుకంత భయం? అని నిలదీశారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడుతున్నారని ప్రచారం చేశారని, ల్యాబ్ రిపోర్ట్ వచ్చి 2 నెలలైతే ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. నెయ్యి ట్యాంకర్లు చంద్రబాబు హయాంలోనే వచ్చాయని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు 18 సార్లు నెయ్యిని రిజక్ట్ చేశారని గుర్తు చేశారు. మొదట వనస్పతి ఆయిల్ కలిసిందని టీటీడీ ఈవో ప్రకటించారని, ఇప్పుడు మళ్లీ సీఎం చంద్రబాబు చెప్పిన అంశాన్ని సమర్థించడానికి ఈవో కష్టపడ్డారని అన్నారు అంబటి.
జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు రుజువు చేయలేదని, తిరుమలలో వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు అంబటి. తిరుమలలో దేవుడి సాక్షిగా ప్రమాణం చేయడానికి చంద్రబాబు, లోకేష్ కు ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల శ్రీవారిని వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబువి దుర్మార్గమైన రాజకీయాలని, ఆ దేవుడే ఆయన్ను శిక్షిస్తాడని చెప్పారు అంబటి.