తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడప్పుడే సమసిపోయేలా లేదు. ఇక లడ్డూ తయారీ వ్యవహారంలో మరింత అప్రమత్తతతో ఉంటామని ప్రకటించారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఆవు నెయ్యి స్వచ్ఛతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై దేశ వ్యాప్తంగా భక్తులు ఆందోళనకు గురవుతున్నారంటూ.. ఇప్పుడున్న పరిస్థితిని ఆయన వివరించారు.
ప్రస్తుతం నందిని, ఆల్ఫా ఫుడ్స్ నుంచి కేజీ రూ.475కు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు టీటీడీ ఈవో శ్యామలరావు. తాము తెప్పించిన నాణ్యమైన నెయ్యితోనే ఇప్పుడు ప్రసాదాలు తయారు చేస్తున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో కుదిరిన ఒప్పందాలన్నీ రద్దు చేస్తున్నట్టు తెలిపారు.
ఇకపై నెయ్యి విషయంలో పొరపాట్లు జరగకుండా 18 మందితో సెన్సరీ ప్యానల్ ఏర్పాటు చేశామని చెప్పారు టీటీడీ ఈవో. మూడు నెలల్లో సెన్సరీ ల్యాబ్ కూడా పెడతామన్నారు. గుజరాత్ లోని ఎన్డీడీబీ ల్యాబ్ సహకారంతోనే పరికరాలు తీసుకువస్తు్న్నామన్నారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పులు చేస్తున్నామని ప్రకటించారు.
ఇక తిరుమలలో ఇప్పటికే అపచారం జరిగిందని అంటున్న ఆయన ఆ దోషాల నివారణకు ఆగస్టు 15 నుంచి 17 వరకు పవిత్ర ఉత్సవాలు నిర్వహించామని వెల్లడించారు. శ్రీవారి భక్తులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని పిలుపునిచ్చారు ఈవో శ్యామలరావు.