తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నవన్నీ అవాస్తవాలేనని అన్నారాయన. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆ లేఖలో అంశాలను ఓసారి పరిశీలించాలంటూ జగన్ నేషనల్ మీడియాని, కేంద్ర మంత్రుల్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వేస్తున్నారు.
https://x.com/ysjagan/status/1838146346978570269
కప్పిపుచ్చుకోడానికే..
ఏపీలో ప్రభుత్వం 100 రోజులు పూర్తైందని, తమ పాలన అద్భుతంగా ఉందంటూ టీడీపీ గొప్పలు చెప్పుకుంటోందని, కానీ వాస్తవం వేరేగా ఉందన్నారు జగన్. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై ప్రతికూలత మొదలైందని చెప్పారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, నిలబెట్టుకోవడంలో కొత్త ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు జగన్. ప్రజల దృష్టిని మరల్చడానికే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. తిరుమలలో జరుగుతున్న వాస్తవాలను దాచిపెట్టి కేవలం కుట్రకోణంతోనే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు జగన్.
తిరుమల లడ్డూ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తమ హయాంలో తప్పు జరగలేదని వైసీపీ అంటోంది, తప్పు జరిగింది వారి హయాంలోనే అని, నెయ్యి కాంట్రాక్ట్ జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్నదేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అసలు తప్పు జరగకపోయినా చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తోందని, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తోందని జగన్ అంటున్నారు. ఈమేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. ఆ లేఖలోని అంశాలను పరిశీలించాలని కేంద్రమంత్రుల్ని కూడా ఆయన కోరారు. మరి ఈ వివాదంలో ఎవరి వాదన నిలబడుతుంది, ఎవరి మాటల్ని ప్రజలు విశ్వసిస్తారనేది తేలాల్సి ఉంది.