ఓ వైపు జనసేనతో పొత్తు.. మరోవైపు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు.. దీంతో టీడీపీ నేతలకు టికెట్లు దక్కుతాయో లేదోనన్న గుబులు మొదలైంది. పొత్తులో కచ్చితంగా తమకు దక్కవనుకున్న సీట్లలో ఎప్పటి నుంచో కాచుకుని కూర్చున్న నేతలు ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారు. తాజాగా బీజేపీతో పొత్తు యత్నాలు ముమ్మరం కావడంతో బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేష్ తోడల్లుడు భరత్ కూడా ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు.
గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి
2019 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసిన భరత్ వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 4,500 ఓట్ల తేడాతోనే ఓటమి చవిచూశారు. ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణకు దాదాపు 2 లక్షల 88 వేల ఓట్లు రావడంతో ఓటు చీలి తాను ఓడిపోయానని గుర్తించిన భరత్ ఈ సారి జనసేనతో పొత్తు ఉంటుంది కాబట్టి తన గెలుపు నల్లేరుపై నడకేనని భావిస్తూ వచ్చారు.
విశాఖ కాకపోతే రాజమండ్రి ఇవ్వండి
అయితే ప్రస్తుతం బీజేపీతో పొత్తు ఖరారైతే ఆ పార్టీ కచ్చితంగా విశాఖ ఎంపీ సీటు అడుగుతుంది. కాబట్టి ప్రత్యామ్నాయంగా రాజమండ్రి ఎంపీ సీటు కోసం భరత్ ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ మురళీమోహన్ కోడలు మాగంటి రూప పోటీ చేసి ఓడిపోయారు. అయితే జనసేనతో పొత్తు, కాపుల ఓట్లు భారీగా ఉండే ఈ నియోజకవర్గంలో టీడీపీకి విజయావకాశాలు బాగుంటాయని అంచనా వేస్తున్న భరత్ ఇక్కడ సీటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పోటీలో ఇద్దరు
అయితే రాజమండ్రి ఎంపీ స్థానంలో టీడీపీ టికెట్ కోసం ఇప్పటికే శిష్ట్లా లోహిత్, బొడ్డు వెంకటరమణ చౌదరి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు భరత్ కూడా రావడంతో రేసు మరింత రసవత్తరంగా మారబోతోంది. తోడల్లుడు సహకరించి భరత్కు టికెట్ ఇప్పిస్తాడా, ముందు నుంచి ఉన్న నేతలకే టికెట్
దక్కుతుందా చూడాలి.