వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవచ్చేమో గానీ, కాళ్లు పట్టుకోవడంలో కాంపిటీషన్ పెడితే, విజయం ఆయనదే..!
ముందు జాగ్రత్త చర్యగా బాబుగారు పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకున్నారు. ఇప్పుడు బీజేపీ హిందుత్వ బాస్ అమిత్ షా కాళ్లు పట్టుకున్నారు. 73 ఏళ్ల వయసుని ఖాతరు చేయకుండా, చంద్రబాబు, అమిత్ షాని చూడగానే, హఠాత్తుగా కిందికి ఒంగి రెండు చేతులతో కాళ్లకి దండం పెట్టారు. అమిత్ షా కూడా ఇలాంటి చెంచాగిరీని ఊహించి ఉండరు. గౌరవంతోనో, అపారమైన వ్యక్తిగత స్నేహంతో చంద్రబాబు ఆయన కాళ్లకి మొక్కితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. రాజకీయంగా బీజేపీకి తెలుగుదేశం శత్రువు. మోడీ, అమిత్ షా చంద్రబాబుని ఎప్పుడూ ఆమడదూరంలోనే ఉంచారు. పరోక్షంగానైనా జగన్కి సహకరించారు గానీ, చంద్రబాబుని మాత్రం ‘అంటరానివాడి’గానే చూశారు.
టీడీపీ మౌలికంగా సెక్యులర్ పార్టీ. ఒక్క మతాన్ని మాత్రమే నమ్ముకున్నది బీజేపీ. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న, శక్తి సామర్థ్యంతో ముందుకు దూసుకుపోతున్న కాషాయ పార్టీకి చేరువ కావడానికి చంద్రబాబు ఒక పన్నాగం పన్నారు. కొన్ని పాచికలు కదిపారు.
ఎత్తుగడ 1: సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ వంటి కాపు నాయకులతో సన్నిహితంగా మెలిగి బీజేపీకి దగ్గర కావడానికి ఒక రాచమార్గం ఉంది. దాని పేరు పవన్ కళ్యాణ్. ఢిల్లీలో చంద్రబాబు పనులన్నీ చేసిపెట్టాడు పవన్.
ఎత్తుగడ 2: సోము వీర్రాజుని ఇంటికి పంపి, ఆంధ్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరిని కుర్చీ ఎక్కించాడు. దీని కోసం తెరవెనక పెద్ద కథ నడిచింది. ఆమె, ఎంత చెడ్డా బంధువు గనక చంద్రబాబుకి కొంత వెసులుబాటు కలిగింది.
ఎత్తుగడ 3: షర్మిలారెడ్డిని రంగంలోకి దించుట. జగన్ని చికాకుపెట్టడానికీ, అవమానించడానికి ఆమె అద్భుతంగా పనికొస్తుంది. బాబుకి శ్రమ తగ్గుతుంది.
ఎత్తుగడ 4: పవన్ని, పురందేశ్వరిని ఉపయోగించుకుని, తనకి అమిత్ షా నుంచే ఫోన్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం. అమిత్ రారమ్మని నోరారా పిలిచినందుకు, కాళ్లపై పడి కృతజ్ఞతలు చెప్పుకోవడం. బీజేపీ ఆంధ్రలో ఎన్ని సీట్లు కావాలో ఆదేశించండని అభ్యర్థించడం. oh what a fall ఇది కదా పతనం అంటే. తెలుగుదేశం ఆత్మగౌరవం అనే మేలిమి బంగారాన్ని మంత్రి అమిత్ షా ఫైనాన్స్ కంపెనీలో తాకట్టుపెట్టడం అంటే ఇదేగా మరి..!
ప్రశాంత్ కిషోర్, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, షర్మిలారెడ్డి.. వీళ్లందరినీ జాగ్రత్తగా కూడగట్టి, కూటమిపెట్టి, గెలిచేస్తున్నాం అనే గాలి మాటలతో హోరెత్తించి, బీజేపీ అగ్రనాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే కుటిల పన్నాగం ఒక్క నీతిలేని చంద్రబాబుకే సాధ్యం.
టీడీపీ ఎన్టీ రామారావు పార్టీ.. ముఖ్యమంత్రి కుర్చీ.. ప్రజా నాయకుడు ఎన్టీఆర్ది. ఆనాడు పార్టీనీ, కుర్చీనీ లాగేసుకున్నాడు. ఆనక విజనరీగా, ముఖ్యమంత్రిగా విర్రవీగి, సొంత వ్యాపారాలు పెంచుకుని, ప్రజలు కొట్టిన దెబ్బకి రెండు కళ్లూ తిరిగి, మూడు లోకాలూ ఒకేసారి కనిపించి 23 సీట్లలో అవమానభారంతో కుదేలైపోయాడు. జగన్మోహన్రెడ్డి అనే ప్రజాకర్షణ గల నాయకుడు అమరావతిలో చాచికొడితే, దిమ్మతిరిగిన చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా కళ్ల మీద పడ్డాడు.
ఇది నూటికి నూరుపాళ్లూ జగన్ విజయం. జగన్ ఒక్కడే, సింగిల్గానే, వైఎస్సార్ జెండాతోనే ఎన్నికల బరిలోకి వస్తున్నాడు. అది కదా ధైర్యం అంటే.. అది కదా పోరాట పటిమ అంటే..
కోట్లు ఇచ్చి, కుట్రలు చేసి, కాళ్లు పట్టుకుని, కుతంత్రాలతో ఎన్నికలలో గెలవాలనుకోవడం ఎంత నీచత్వం..! నీతిలేని చంద్రబాబు నీచత్వం వర్ధిల్లాలి..!