‘‘ఇరగదీశావ్ బాబూ, నువ్వు టూమచ్..! నీ ఎత్తుగడకి జగన్ ముఠా చిత్తు, చిత్తు’’ అని చంద్రబాబు భుజం ఆయనే చరచుకోవాల్సిన సమయం ఇది. ఆంధ్ర రాష్ట్రంలో గిర్రున తిరుగుతున్న ఫ్యాన్ ఆగిపోవాలంటే ఢిల్లీ వెళ్లి స్విచ్ నొక్కాలని సారుకి తెలుసు. ఢిల్లీలో కాళ్ల బేరం ఫలించిందనే అనుకుందాం… అసలు సమస్య అక్కడే ఉంది. జగన్ పళ్లు వూడగొట్టడానికి అందర్నీ కూడగట్టగానే సరిపోదు. ఇప్పుడిక పంచాలి. సీట్ల పంపకం అనే అతి పెద్ద గొడవకి తెర లేస్తుందిప్పుడు. పవన్కెన్ని..? బీజేపీకెన్ని..? మరి షర్మిలో..? వోయమ్మ–175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయిగా అనిపిస్తుంది. 30–40 మధ్య అయితేగానీ కుదరదు అంటున్నాడు పవర్ స్టార్. కనీసం 10–15 సీట్లు లేకపోతే ఎలా అనేది బీజేపీ వాదన. అన్నని అనరాని మాటలన్న ఓవర్ యాక్షన్ షర్మిలకి ముచ్చటగా మూడు సీట్లు అయినా లోపాయికారిగా ఇవ్వాలా వద్దా..? ఇదీ అసలు సిసలు గొడవ. చంద్రబాబు సొంత తెలివితో చేతులారా తవ్వకున్న గొయ్యి చిన్నదేమీ కాదు. చీమూనెత్తురులాగా డబ్బూ కులమూ కలిసి ప్రవహించే దగుల్బాజీ రాజకీయాలు మనవి..!
పాతికేళ్లు పరిపాలించి పాతుకుపోయి ఉన్న తెలుగుదేశం పార్టీకి రాష్ట్రమంతా కార్యకర్తలున్నారు.. నాయకులున్నారు. కనుక 40కి పైగా సీట్లు పంపకాలకే పోతే, ఆ 40 నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులు దారుణంగా హర్ట్ అవుతారు. తిడతారు, తిరగబడతారు. మరొక పార్టీలో చేరుతారు. ఏళ్ల తరబడి పనిచేసినా చంద్రబాబు ద్రోహం చేశాడని అంటారు. ఈ రాజకీయ తలనొప్పికి ఏ అమృతాంజనమూ పనిచేయదు.
కృష్ణా జిల్లా Strong Man కేశినేని నాని, పట్టరాని కోపంతో బాబుని తిట్టి, వైఎస్సార్ సీపీలో చేరిపోయాడు. విజయవాడ నగరంలో, కృష్ణా జిల్లాలో టీడీపీని తుడిచిపెడతానని శపథం చేశాడు. దీనికి రివర్స్లో లావు రత్తయ్య కుమారుడు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ మీద కోపంతో తెలుగుదేశం వైపు జరిగాడు. అతనికీ ఇప్పుడు టికెట్ ఇచ్చి తీరాలి. నానీ గానీ, దేవరాయలు గానీ వ్యాపార సామ్రాజ్యాలతో, వేల కోట్లతో పులిసిపోయివున్నారు. వాళ్లని కాదనడం ఏ నాయకుడి వల్లా కాదు. ఇలాంటి గండభేరుండ పక్షులు పార్టీల మీద వాలినప్పుడు చిన్నపిట్టలూ, పావురాలూ చెల్లాచెదురైపోతాయి. పార్టీలు కోట్లు ఉన్నవాళ్ల బూట్లు నాకుతున్నాయని బాధపడతారు.. అదంతా అసమ్మతి చిచ్చుగా మారుతుంది.
ఒక రకంగా చూస్తే, తలెత్తుకుని సింగిల్గా వస్తున్న జగన్కి ఇది మంచి అవకాశం. నాలుగు పడవల మీద కాళ్లేసి నాటకాలు ఆడుతున్న చంద్రబాబుకిది ప్రాణ సంకటం. పవన్ కళ్యాణ్.. ఒకవేళ రాజీపడినా కాపులు ఊరుకోరు. 20 శాతం పైగా ఓట్లు కాపులకు ఉంటే 20 సీట్లకే మమ్మల్ని అమ్మేస్తావా అని నిలదీస్తారు. చంద్రబాబు అంతుచూస్తారు. ఏకఛత్రాధిపత్యంతో కేంద్రంలో విర్రవీగుతున్న బీజేపీకి అయిదారు సీట్లు ఇస్తా అంటే వాళ్లు పీక కోస్తారు. నువ్వు చెప్పినట్టుగా అన్ననీ, మిగతా వాళ్లనీ చచ్చేట్టు తిట్టాను, రెండు సీట్లేనా బాబూ అని షర్మిల అలగొచ్చు. రాయలసీమలో ఎలాగూ వైసీపీ గాలి వీస్తోంది గనక, కోస్తా, ఉత్తరాంధ్ర రెండు కత్తులై చంద్రబాబు నెత్తి మీద వేలాడుతున్నాయి.
పెను తుఫానుగా మారుతున్న ఈ రాజకీయ వాయుగుండం, అల్లకల్లోలంగా ఉన్న విశాఖ సముద్రతీరం మీదుగా త్వరలోనే తెలుగుదేశాన్ని తాకుతుంది. ఈ రాజకీయ దురాగ్రహ కెరటాల దెబ్బకి ఎన్ని చెట్లు కూలిపోతాయో, ఎందరు నాయకుల ఇళ్లు కొట్టుకుపోతాయో, అనాథలుగా మిగిలిపోతున్న చంద్రబాబు, లోకేష్బాబుకి గడ్డిపోచలు మాత్రమే మిగులుతాయేమో..!
కత్తులు బండబారిపోవడం సహజం, ‘చంద్రప్రదేశ్’ కల మరి ఎన్నికలకు ముందే చెదిరిపోతుందా..?