ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ నేతలు కొందరు వ్యతిరేకిస్తున్నారట. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని చంద్రబాబుకి చెబుతున్నారట.
ఇప్పటికే పొత్తు విషయంలో చంద్రబాబు బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. కానీ ఎక్కువ సీట్లు అడగడంతో బాబు డైలమాలో పడ్డాడు. బీజేపీతో పొత్తు విషయంలో పార్టీలోని సీనియర్ల నుండి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీతో పొత్తు వద్దంటే వద్దని సీనియర్లు చెబుతున్నారట. బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి నష్టమే కాని ఎలాంటి లాభం ఉండదని తమ్ముళ్ళు స్పష్టంగా చెప్పారని సమాచారం.
జనసేనతో పొత్తు అంటే ఏమీ మాట్లాడని టీడీపీ నేతలు బీజేపీతో పొత్తు అంటే మాత్రం ఎందుకు భయపడుతున్నారు..? వారి భయం వెనక పెద్ద కారణమే ఉంది. రాయలసీమ(rayalaseema)లో ముస్లిం మైనారిటీల ఓట్లు కీలకంగా ఉన్న నియోజకవర్గాలు సుమారు 22 ఉన్నాయి. వీటిల్లో కడప, కర్నూలు, అనతపురం జిల్లాల్లో ఎక్కువ నియోజకవర్గాలున్నాయి. బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం మైనారిటీ ఓట్లన్నీ టీడీపీ, జనసేనకు దూరమవుతాయని సీమలోని తమ్ముళ్ళు బాగా భయపడుతున్నారు. వాస్తవానికి ముస్లిం మైనారిటీలు టీడీపీకి దూరమై చాలా కాలమైపోయింది. గడచిన రెండు ఎన్నికల్లో టీడీపీ తరపున ఒక్క ముస్లిం మైనారిటీ నేత కూడా గెలవలేదు.
గడచిన రెండు ఎన్నికల్లో గెలిచిన ముస్లిం మైనారిటీ నేతలంతా వైసీపీవాళ్ళే. కడప, విజయవాడ పశ్చిమం, కర్నూలు, మదనపల్లి, గుంటూరు నియోజకవర్గాల్లో వైసీపీనే గెలిచింది. అయితే రాబోయే ఎన్నికల్లో ముస్లింలు టీడీపీ+జనసేనకు మద్దతుగా నిలబడతారని చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళు అనుకుంటున్నారు. ఈ సమయంలో సడెన్గా బీజేపీతో పొత్తంటే మళ్ళీ ముస్లింలు మళ్ళీ టీడీపీకి దూరమై వైసీపీకే ఓట్లేస్తారనే భయం తమ్ముళ్ళల్లో పెరిగిపోతోంది. అందుకనే పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే పొత్తు వద్దంటే వద్దు అంటున్నారు.
చిత్తూరు జిల్లాలోని పీలేరు, మదనపల్లి, వాయల్పాడు, తిరుపతి నియోజకవర్గాల్లో ముస్లింల సంఖ్య బాగానే ఉంది. ఇక కడప జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, కమలాపురంలో ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు. కర్నూలు జిల్లాలోని కర్నూలు, ఆళ్ళగడ్డ, ఆదోని, నంద్యాల, బనగానపల్లి, శ్రీశలైం, నందికొట్కూరు నియోజకవర్గాల్లోనూ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఆళ్ళగడ్డ, కర్నూలు, నంద్యాలలో అయితే గెలుపును నిర్ణయించేది ముస్లిం సోదరులే.
అలాగే అనంతపురం జిల్లాలోని హిందుపురం, కదిరి, అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, గుంతకల్, పెనుకొండ నియోజకవర్గాల్లో ముస్లింలు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నారు. అందుకే.. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. ఆ ఓట్లన్నీ వైసీపీ(ysrcp)కే వెళ్లిపోతాయని టీడీపీ నేతలు భయపడుతున్నారు. మరి చంద్రబాబు వారి భయాన్ని అర్థం చేసుకొని పొత్తు వదులుకుంటారో లేదా, ముందుకు సాగుతారో చూడాలి.