భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలమైన విషయం తెలిసిందే. నగరంలోని కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇక రాజధాని ప్రతిపాదిత ప్రాంతం అమరావతి సైతం సముద్రాన్ని తలపిస్తోంది. భారీ వర్షానికి ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెటైర్లు సైతం పేలుతున్నాయి.
భారీ వర్షాల కారణంగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అమరావతి – గుంటూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి హైకోర్టు ప్రాంగణంలోకి సైతం వరద నీరు వచ్చింది. నోవాటెల్ హోటల్ పరిసర ప్రాంతాల్లో మోకాళ్లలోతుకు మించి వరద నీరు నిలిచింది. SRM యూనివర్సిటీని వరద నీరు చుట్టుముట్టింది. టవర్ల నిర్మాణాల కోసం గతంలో ప్రభుత్వం తీసిన గుంతలు వరద నీటితో నిండిపోయాయి.
కొండవీటి వాగుతో పాటు కోటేళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నీరంతా సమీప పొలాల్లోకి చేరింది. అటు కృష్ణానదికి సైతం ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ముళ్ల చెట్ల తొలగింపు కోసం రూ.36 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పుడు ఈ పనులకు అంతరాయం ఏర్పడింది. వరద నీరు తోడేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. నీటి తొలగింపు ప్రక్రియ CRDA అధికారులకు సవాల్గా మారనుంది.
నిజానికి అమరావతి ప్రాంతం రాజధానికి అనువైన ప్రాంతం కాదని అనేక మంది నిపుణులు చెప్పారు. అమరావతికి కొండవీటి వాగుతో వరద ముప్పు ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఐతే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి ఒకే చెప్పింది.