పిల్లల బంగారు భవిష్యత్తు కోసం విద్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెడుతున్న సంక్షేమ పథకాల సొమ్ము ఏ మాత్రం ఉచితాలు కావు. పథకాల ద్వారా అందిస్తున్న సొమ్మును సామాజిక పెట్టుబడిగా పరిగణించాలి. చంద్రబాబు అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఇటు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను ప్రోత్సహించారు. నారాయణ, చైతన్య విద్యా సంస్థలు పుంజుకుని ప్రజల డబ్బును దండుకునే ప్రక్రియను కొనసాగించారు. అందుకు భిన్నంగా రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారు సీఎం వైయస్ జగన్. ఫలితంగా నిరుపేద పిల్లలు మెరుగైన విద్యను పొందగలుగుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను వైఎస్ జగన్ పూర్తిగా మార్చేశారు. అప్పటి పాఠశాలలతో ఇప్పటి పాఠశాలలను బేరీజు వేసుకుని చూస్తే ఎంత మార్పు వచ్చిందో మనకు అర్థమవుతుంది. జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పలు పథకాలను ఆయన అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం చదువులను ప్రవేశపెట్టారు. దీనివల్ల ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో చదువుకున్న సంపన్న వర్గాలకు చెందినవారితో పేద, దళిత, మైనారిటీ అభ్యర్థులు జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాల కోసం పోటీపడే స్థితికి చేరకుంటారు. ఈ ఫలితాలు అనుభవంలోకి రావడానికి కొంత కాలం పడుతుంది. అందువల్ల సమాజం మీద జగన్ పెడుతున్న పెట్టుబడిగా దాన్ని భావించాల్సి ఉంటుంది.
విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యాదీవెన స్కీమ్ ద్వారా రూ.1.25 కోట్ల వరకు ఆర్థిక సాయం చేస్తోంది. ఏపీ చదువులు బెస్ట్ అని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది కూడా. విదేశీ విద్యా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి, అక్రమాలకు ఆలవాలంగా మార్చింది. విదేశీ విద్యా పథకంలో జగన్ ప్రభుత్వం సమూల మార్పులు చేసి నిజమైన అర్హులకు ఆ పథకం ద్వారా ప్రయోజనం కలిగిస్తోంది. ఇప్పటి వరకు 41 మంది ఎస్సీ విద్యార్థులు ఈ పథకం కింద ప్రయోజనం పొంది విదేశాల్లోని విశిష్టమైన విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
గిరిజన విద్యా సంస్థలను జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. వారి భోజన, ఇతర సదుపాయాల కోసం రూ.920.31 కోట్లు ఖర్చు చేసింది. ఎస్సీ, ఎస్టీ హాస్లళ్లలో చదువుకునే విద్యార్థుల్లో 2019, 2023 మధ్య కాలంలో దాదాపు 400 మంది ఐఐటీ, ఎన్ఐటి, నీట్ ర్యాంకులు సాధించడమే అందుకు సాక్ష్యం.
జగన్ ప్రభుత్వం 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం వల్ల 47 లక్షల మందికి ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్య అందుతోంది. గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 371 ఆశ్రమ పాఠశాలలు, 18 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 1958 పాఠశాలలను జగన్ ప్రభుత్వం ఆధునికీకరించింది. వాటిలో 1,55,599 మంది విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతోంది.
గిరిజనులకు ఉన్నత విద్యను అందించి ఉన్నత స్థాయిని పొందడానికి అవసరమైన చర్యలను కూడా జగన్ ప్రభుత్వం తీసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా కురపాంలో రూ.153.85 కోట్లతో నిర్మిస్తున్న ఇంజినీరింగ్ కళాశాలల్లో సగం సీట్లు, అంటే 150 సీట్లు గిరిజన విద్యార్థులకే రిజర్వ్ చేసింది. సాలూరులో రూ.561.88 కోట్లతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి అంకురార్పణ చేసింది. పాడేరులో రూ.500 కోట్లతో గిరిజన వైద్య కళాశాలను మంజూరు చేసింది.
వైసీపీ ప్రభుత్వం జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సహకాలను కూడా ప్రకటించింది. మెయిన్స్కు అర్హత సాధిస్తే లక్ష రూపాయలు, ఇంటర్వ్యూకు అర్హత సాధించినవారికి అదనంగా 50 వేల రూపాయల చొప్పున ప్రోత్సహకాలను ప్రకటించింది.