సీట్ల పంపకంలోనూ అభ్యర్థుల ఎంపికలోనూ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ పట్ల అనుసరిస్తున్న కుటిల ఎత్తుగడలపై బీజేపీ అగ్రనాయకత్వం అప్రమత్తమైంది. ఆ విషయంపై చర్చించడానికి బీజేపీ పెద్దల నుంచి పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి పిలుపు వచ్చింది. దీంతో ఆమె హుటాహుటిన హస్తిన బయలుదేరి వెళ్లారు.
టీడీపీ ఏనాడు గెలువని సీట్లను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తమకు కట్టబెడుతున్నారని, అందులోనూ టీడీపీని వదిలి బీజేపీలో చేరినవారికి టికెట్లు ఇచ్చేలా వ్యూహం రచించారని రాష్ట్ర బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. బీజేపీ సీట్లపై చంద్రబాబు పెత్తనం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర పార్టీ సీనియర్ నేతలు కొంత మంది శివప్రకాష్ జీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై 16 మంది బీజేపీ సీనియర్ నాయకులు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా లేఖ రాశారు.
పాడేరు, అనపర్తి, ఆదోనీలతో పాటు మరికొన్ని సీట్లపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ విషయాలన్నింటి మీద చర్చించడానికి పురంధేశ్వరిని హస్తినకు పిలిపించినట్లు సమాచారం. ఈ నెల 21వ తేదీలోపు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు లోక్సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు దక్కాయి.